చంద్రబాబుకు ఆహ్వానం పంపిన మోడీ-భీమవరం టూర్ కు-అంతలోనే కిషన్ రెడ్డి మరో ట్విస్ట్
ఏపీలో ఒకప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేసి పదేళ్ల గ్యాప్ తర్వాత అధికారంలోకి రావడంతో పాటు విభజన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉంది. అయితే అంతా సజావుగా సాగుతున్న తరుణంలో వైఎస్ జగన్ ట్రాప్ లో పడి విభజన హామీలపై కేంద్రంపై పోరు మొదలుపెట్టిన చంద్రబాబు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఎన్నికల్లో భారీ నష్టాలు చవి చూడటంతో పాటు ఆ తర్వాత కూడా బీజేపీకి పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది. అనంతరం ఎన్ని ప్రయత్నాలు చేసీనా మోడీ కరుణించలేదు. కానీ ఇన్నాళ్లకు చంద్రబాబును ఆయన కరుణించారు.
ప్రధాని మోడీ భీమవరం టూర్
భీమవరంలో ప్రధాని మోడీ వచ్చే నెల 4న పర్యటించబోతున్నారు. విప్లవవీరుడు అల్లూరి సితారామరాజు 125వ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన భీమవరం వస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసి నివాళులు అర్పించబోతున్నారు. ఈ కార్యక్రమానికి అధికార వైసీపీతో పాటు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపుతున్నారు.
చంద్రబాబుకు మోడీ ఆహ్వానం
ప్రధాని మోడీ భీమవరం టూర్ కు హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, విపక్ష నేత కూడా అయిన చంద్రబాబుకు ఆహ్వానం పంపింది. అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాల్లో పాల్గొనాలని అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపుతున్న కేంద్రం.. ఇందులో భాగంగా చంద్రబాబును కూడా ఆహ్వానిస్తూ లేఖ రాశారు.
అంతే కాదు కిషన్ రెడ్డి పేరుతో రాసిన ఈ లేఖ అందిన తర్వాత .. ఆయన నేరుగా చంద్రబాబుకు కూడా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని మోడీ హాజరువుతున్న కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది.
చంద్రబాబుకు కిషన్ రెడ్డి లేఖ
ఈ నెల 27న టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర సాంస్కతిక వ్యవహారాల మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇందులో ఆయన మన్యం వీరుడిగా దేశంలో పలు రాష్ట్రాలు గర్వించే అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని కేంద్రం ఈసారి అధికారికంగా నిర్వహిస్తోందని, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దీన్ని చేపడుతున్నట్లు తెలిపారు. భీమవరంలో ప్రధాని మోడీ హజరవుతున్న ఈ కార్యక్రమానికి ఓ ప్రజాప్రతినిధిని పంపాలని కోరారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా జూలై 4 నుంచి ఏడాది పాటు కేంద్రం నిర్వహించే పలు కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి కోరారు.
2019 తర్వాత ఇదే తొలిసారి
గతంలో టీడీపీ-బీజేపీ 2014లో కలిసి పోటీ ఉమ్మడిగా కేంద్ర, రాష్ట్రాల్లో విజయం సాధింఛాయి. అలాగే కేంద్రంలో మోడీ కేబినెట్ లో ఇద్దరు టీడీపీ మంత్రులకు అవకాశం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ తరఫున ఇద్దరు మంత్రులకు చంద్రబాబు అవకాశం కల్పిచారు. ఆ తర్వాత జగన్ ట్రాప్ లో పడి విభజన హామీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు దెబ్బతిన్నారు. ఆ తర్వాత తిరిగి బీజేపీతో స్నేహం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు ఇన్నాళ్లకు మోడీ ఆహ్వానం పంపారు. అయితే అక్కడే మరో ట్విస్ట్ నెలకొంది.
చంద్రబాబు స్ధానంలో అచ్చెన్నాయుడు హాజరు
అయితే కిషన్ రెడ్డి చంద్రబాబుకు రాసిన లేఖలో ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబును నేరుగా మీరు రావాలని కోరకుండా మీ పార్టీ తరఫున ఓ ప్రజాప్రతినిధిని పంపాలని మాత్రమే కోరారు. దీంతో పార్టీలో ఈ విషయాన్ని చర్చించిన చంద్రబాబు... ఏపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని భీమవరం పంపాలని నిర్ణయించారు.
దీంతో ఆయన వచ్చేనెల 4న ప్రధాని మోడీ టూర్ లో టీడీపీ ప్రతినిధిగా హాజరుకాబోతున్నారు. అయితే ఇంతకూ కేంద్రం పంపిన లేఖలో చంద్రబాబుకు నేరుగా ఎందుకు ఆహ్వానం పంపలేదనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. మోడీ టూర్ లో చంద్రబాబును రప్పించడం ఇష్టంలేకపోవడం వల్లే ఇలా చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది.