జీవో నెంబర్ 1 పై హైకోర్టు సంచలన తీర్పు..!!
ఏపీలో సంచలనంగా మారిన జీవో నెంబర్ 1 పై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. బహిరంగ ప్రదేశాలు..రద్దీ కూడళ్లలో సభలు..సమావేశాలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని పైన ప్రతిపక్ష పార్టీలు హైకోర్టులో సవాల్ చేసాయి. దీని పైన విచారణ చేసిన హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను కొట్టి వేసింది. ఈ జీవో ప్రాధమిక హక్కలకు భంగం వాటిల్లేదిగా ఉందని అభిప్రాయపడింది. ఈ తీర్పు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉంది.
జీవో నెంబర్ 1 కొట్టివేత : టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో తొక్కిసలాట జరిగింది. ప్రాణనష్టం సంభవించింది. ఆ సమయంలో రాష్ట్రంలో సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెం.1ను తీసుకువచ్చింది. దీని పైన రాజకీయంగా రగడ చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు సభలు ఏర్పాటు చేసుకోకుండా ఈ జీవో తీసుకొచ్చిందని ఆరోపణలు చేసాయి. ప్రభుత్వం మాత్రం సభలు వద్దని చెప్పటం లేదని..రద్దీ ప్రదేశాలు, రోడ్ల పైన మాత్రం నిర్వహణ పైన ఆంక్షలు విధించామని స్పష్టం చేసింది. ఇది ప్రతిపక్షాలకే కాదని, అధికార పార్టీకి వర్తిస్తుందని వైసీపీ నేతలు స్ఫష్టం చేసారు. దీని పైన తొలుత వెకేషన్ బెంచ్ జడ్జి జీవో నెంబర్ 1 ను సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో : సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వం అప్పీల్ చేసింది. విచారణ చేసిన డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించింది. ఇందులో భాగంగా జీవో నెంబర్ 1 ను సస్పెండ్ చేసింది. ఈ జీవో ప్రాధమిక హక్కులకు విఘాతంగా ఉందని పిటీషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఈ జీవో తీసుకొచ్చారని కోర్టుకు నివేదించారు. పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారని న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ జోవో ఇచ్చారని కోర్టు ముందు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసారు. కందుకూరు, గుంటూరు లో జరిగిన ఘటనలను చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జోవో అమలు చేయటం సరి కాదని పిటీషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు.

సుప్రీంకు ఏపీ ప్రభుత్వం : జనవరిలోనూ ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. కానీ, తీర్పు రాకపోవటంతో పిటీషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. కేసు హైకోర్టులో ఉండటంతో అక్కడ తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని సుప్రీం సూచించింది. ఈ క్రమంలో ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువరించింది. జీవోను రద్దు చేయటంతో ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీని పైన ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే, జీవో పైన హైకోర్టు తీర్పు లో ఏ అంశాలను పేర్కొన్నదనేది చూసిన తరువాత ప్రభుత్వం తదుపరి అడుగులు వేసే అవకాశం ఉంది. తీర్పు పూర్తి పాఠం తెలిసిన తరువాత అధికారికంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications