AP Elections: ఏపీలో మరో సీనియర్ ఐపీఎస్ పై ఈసీ వేటు..!
ఏపీలో ఐపీఎస్ అధికారులపై ఈసీ కొరడా ఝళిపిస్తూనే ఉంది. ఓవైపు నిన్న రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇద్దరు డీఎస్సీలపై బదిలీ వేటు వేసిన ఎన్నికల కమిషన్.. ఇవాళ మరో కీలక అధికారిపై వేటు వేసింది. రాయలసీమ జిల్లాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న సదరు ఐపీఎస్ అధికారిపై విపక్షాల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. ఈ బదిలీ వేటు వేసింది. దీంతో రాష్ట్రంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్నికల విధులకు దూరమయ్యారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో విపక్ష పార్టీలపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ ఇవాళ బదిలీ వేటు వేసింది. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తక్షణం తప్పుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు సిద్దం చేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో కీలకంగా ఉన్న అమ్మిరెడ్డిపై బదిలీ వేటు చర్చనీయాంశంగా మారుతోంది.
అదే సమయంలో నిన్న అనంతపురం అర్బన్, రాయచోటి డీఎస్పీలను బదిలీ చేసిన ఈసీ.. వారి స్ధానంలో ప్రతాప్ కుమార్, రామచంద్రరాపును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈఓకు ఆదేశాలు పంపింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకూ ఈసీ బదిలీ వేటు వేసిన ఐపీఎస్ ల సంఖ్య 10కి చేరుకుంది. ఇందులో గతంలో ఆరు జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీపై వేటు పడగా.. తాజాగా డీజీపీతో పాటు అనంతపురం రేంజ్ డీఐజీపై వేటు పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల లోపు ఇంకా ఎంతమంది ఐపీఎస్ లపై చర్యలుంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications