ప్రభుత్వ,పోరంబోకు స్థలాలపై ప్రజలకు అవగాహన కల్పించండి:మంత్రి దేవినేని ఉమ
విజయవాడ:ప్రభుత్వ, పోరంబోకు భూముల క్రమబద్దీకరణకు సంబంధించిన జీవో పై సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి దేవినేని ఉమ సూచించారు. విజయవాడలోని జల వనరుల శాఖ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటుచేసిన 'భూసేవ ' శిక్షణ కార్యక్రమంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. మరోవైపు ఈ భూముల క్రమబద్దీకరణ దరఖాస్తుల స్వీకరణకు గడువు మరో 4 నెలలు పెంచారు.
ప్రభుత్వ, పోరంబోకు స్థలాల్లో ఇళ్లు కట్టుకుని దశాబ్దాల తరబడి ఉంటున్న పేదలకు ఆయా స్థలాలను రెగ్యులరైజ్ చేసే లక్ష్యంతో జారీచేసిన జీవో 388 పై అవగాహన కల్పించాల్పిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పటికే ఇలాంటి 40 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని, మరో లక్ష మందికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.

అభ్యంతరం లేని ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారికి 500 గజాల మేర క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఎపి ప్రభుత్వం మరోసారి నాలుగు నెలల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. నిజానికి ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీ ఏప్రిల్ 11తోనే ముగిసిపోయింది. అయితే పేద ప్రజల ప్రయోజనార్థం ఈ గడువును మరో 4 నెలలు పెంచుతూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) అనిల్ చంద్రపునేఠా గడువు పెంచాలంటూ ప్రభుత్వానికి రాసిన లేఖపై స్పందించి రెవిన్యూ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రెవెన్యూశాఖ దరఖాస్తుల స్వీకరణకు గడువు తేదీని ఏప్రిల్ 11 నుంచి వర్తించేలా 4 నెలలు పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. జీవో 388 ద్వారా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు 2017లో ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం వీటి విషయమై ఇప్పటికే రెండుసార్లు గడువు పెంచగా తాజాగా మరోసారి గడువును పెంచడం గమనార్హం.












Click it and Unblock the Notifications