Indian railways: సంక్రాంతికి వందేభారత్ రైలుపై ప్రయాణికులకు శుభవార్త!
భారతీయ రైల్వే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండుగ కావడంతో ఈ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో పలు ప్రత్యేక రైళ్ళు నడుస్తున్నాయి .దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ సందర్భంగా 158 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
సంక్రాంతి పండుగకు 366 ప్రత్యేక రైళ్ళు
ప్రయాణీకుల సౌకర్యం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీధర్ చెప్పారు. విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ రైలు కు అదనపు బోగీలను జత చేస్తున్నట్టు, సాధారణ ప్రయాణీకుల కోసం పెద్ద సంఖ్యలో జన సాధారణ రైళ్ళను నడుపుతున్నట్లు చెప్పారు. పొరుగు డివిజన్లు కూడా కలుపుకొని మొత్తం 366 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్టు తెలిపారు.

విశాఖ- సికిందరాబాద్ వందే భారత్ రైలుకు అదనపు బోగీలు
తెలుగు రాష్ట్రాలలో వివిధ స్టేషన్లకు, కోల్ కత్తా, చెన్నై, బరంపూర్ లాంటి దూర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ - విశాఖపట్నం, విశాఖ- సికింద్రాబాద్ మార్గంలో నడుస్తున్న రెండో వందే భారత్ రైలుకు బోగీల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం ఎనిమిది బోగీలతో నడుస్తున్న వందేభారత్ 20707/20708 రైలు ఈనెల 13వతేదీ నుంచి 16 బోగీలతో నడుస్తాయని వెల్లడించింది.
వందే భారత్ సంక్రాంతికి ఎక్కువ ప్రయాణికులకు సేవలు
ఇక గత సంవత్సరం మార్చి 12వ తేదీన ప్రారంభమైన ఈ వందే భారత్ కు 7 చైర్ కార్ లు, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీ ఉండగా, తాజాగా ఆ సంఖ్య 14 చైర్ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ లకు చేరింది. కొత్తగా బోగీలు యాడ్ కావడంతో ఈ రైలు ఇకపై దాదాపు ఒక వెయ్యి 130 మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చనుంది.
వందే భారత్ ప్రస్తుత కూర్పుతో ప్రయాణికులకు బెనిఫిట్
ఇప్పటివరకు 530 మంది వందే భారత్ లో ప్రయాణాలు చేస్తుండగా, ప్రస్తుత కూర్పు డబల్ ప్రయోజనాన్ని చేకూర్చనుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కు సగటున 145% ఆక్యుపెన్సి ఉండగా, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వస్తున్న వందే భారత్ కు 159%ఆక్యుపెన్సి ఉంది. మొత్తంగా సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్న రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ శుభవార్త చెప్పింది.












Click it and Unblock the Notifications