ఇంద్రకీలాద్రిపై స్వర్ణ కవచాలంకృత దేవిగా దుర్గాదేవి
బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. శ్రీచక్ర అదిష్ఠాన దేవతగా కోరిన వారికి వరాలిచ్చే కొంగు బంగారంగా దుర్గమ్మ వాసికెక్కింది. దుర్గుణాలను పోగొట్టి కొలిస్తే కోరిన శుభాలనొసగే కరుణామయిగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకిగా పేరును సంపాదించింది. అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమ్మవారు కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు. నవరాత్రుల వేళ.. ''కరుణించవమ్మా.. కనకదుర్గమ్మా'' అని వేడుకునేందుకు భక్తులు అమ్మవారికోసం భారీగా తరలిరానున్నారు.
కరోనా తర్వాత ఇదే తొలిసారి..
కరోనా తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూర్తిస్థాయి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఆలయ కమిటీ ఉత్సవాల నిర్వహణకు చేస్తోన్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు పది రోజులపాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దసరా శరన్నవరాత్రుల్లో రోజుకో రూపంలో దర్శనమిచ్చే ఆదిపరాశక్తిని పూజిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పది రోజుల్లో సుమారు 14 లక్షల మంది భక్తులు అమ్మను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ప్రతిరోజూ తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతివ్వడంతోపాటు ఏర్పాట్లు కూడా చేశారు.
స్వర్ణ కవచాలంకృత దేవిగా దుర్గాదేవి
తొలిరోజు స్వర్ణ కవచాలంకృత అలంకరణలో మెరిసే కనకదుర్గాదేవి దర్శనం మాత్రం ఉదయం 9.00 గంటల తరువాతే కల్పిస్తారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకుని తొలి పూజలు చేయనున్నారు. ఉత్సవాల్లో రోజుకు 60 వేల మంది వరకు భక్తులు రావొచ్చని, అక్టోబర్ రెండో తేదీ అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలానక్షత్రం రోజున రెండు లక్షల మందికిపైగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆన్ లైన్ లో అప్పటికప్పుడే టికెట్లు
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచనల మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఢిల్లీరావు, నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో భ్రమరాంబ, సుమారు పది శాఖల అధికారుల ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానదిలో వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నదీ స్నానాలను పూర్తిగా నిషేధించారు. ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. వినాయక గుడి నుంచి టోల్గేటు ద్వారా ఓం మలుపు వరకు మూడు వరసలు, ఓం మలుపు వద్ద అదనంగా ఉచిత దర్శనానికి, వీఐపీలకు ఒక్కొక్క క్యూలైను చొప్పున మొత్తం ఐదు వరుసలు ఏర్పాటు చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మవారి పాదాలు, పున్నమిఘాట్ వద్ద తాత్కాలికంగా షెడ్లు నిర్మించారు. సుమారు 20 లక్షల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం సర్వదర్శనంతోపాటు రూ.100, రూ.300 టిక్కెట్లను, వీఐపీలకు ఐదు వందల రూపాయల టిక్కెట్లను ఆన్లైన్లో అప్పటికప్పుడు అందించే ఏర్పాట్లు చేశారు.