అయ్యా.. మేధావులు కోర్టు తీర్పును కొంచెం చదివి అర్ధం చేసుకోండి : గోరంట్ల వ్యంగ్యం
ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనదైన శైలిలో స్పందించారు . కోర్టు తీర్పు కాపీని చదవకుండానే వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని గోరంట్ల పేర్కొన్నారు. మేధావులు కోర్టు తీర్పును కొంచెం చదివి అర్థం చేసుకోవాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతలనుద్దేశించి పేర్కొన్నారు. ఇక ఆయన చేసిన ట్వీట్ లో
''అయ్యా.. మేధావులు కోర్టు తీర్పును కొంచెం చదివి అర్ధం చేసుకోండి. ఆంగ్ల మాధ్యమం వద్దని చెప్పలేదు. తల్లిదండ్రులు, విద్యార్థుల అభీష్టం ప్రకారం ఏది కావాలంటే ఆంగ్ల భాష లేక తెలుగు భాష అనేది వాళ్ళ కోరిక మేరకు ఉంటుంది అని తీర్పు చెప్పింది. ప్రభుత్వం బలవంతం చేసి వారిపై రుద్దొద్దు అని చెప్పింది. ప్రభుత్వ మేధావులు అయిన వైసీపీ ప్రజా ప్రతినిధులు కోర్టు తీర్పు చదివి అర్థం చేసుకోండి లేకపోతే సలహాదారులు ఉన్నారు కదా.. వాళ్లని చెప్పమనండి'' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్లో పేర్కొన్నారు.
Recommended Video
ఇక పిల్లలు ఏ మీడియం చదవాలో ఆ నిర్ణయాన్ని వారి తల్లిదండ్రులకే వదిలేయాలని కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే టీడీపీ నేతలు తనదైన శైలిలో స్పందిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ తీర్పుకే అంత ఉలికిపాటెందుకని వైసీపీ నేతలను టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు .మీడియా ముందుకొచ్చి వీరంగాలేస్తున్నవారంతా వాళ్ల పిల్లలు చదువుతున్న స్కూళ్లలోనే పేదపిల్లల్ని చదివించండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అప్పుడు చెప్పండి నీతులు అంటూ ట్వీట్ చేశారు. ఏ మీడియం చదవాలన్నది పిల్లల తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయాలని కోర్టు తీర్పులో పేర్కొంటే ఇంత ఉలికిపడతారెందుకో? అంటూ మండిపడుతున్నారు.