పవన్ కల్యాణ్కు కేటీఆర్ వినతి.. సీఎం జగన్పై పంథా మార్చని జనసేనాని.. సాయం చేస్తూనే..
''ప్రశాంతతకు మారుపేరైన ఏపీలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారు.. కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టారు.. సీఎం కుల దురహంకారాన్ని వీడేదాకా ఆయనను 'జగన్ రెడ్డి'అనే పిలుస్తాను..''అని గతంలో శపథం చేసినట్లే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. కరోనా కష్టకాలంలోనూ అదే పంథా కొనసాగించారు. ప్రభుత్వానికి అండగా నిలబడుతూనే సీఎంను 'రెడ్డి'అని సంబోధిస్తూ చురకలు వేశారు. అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్తో మాత్రం పవన్ ఆత్మీయ సంభాషణ జరపడం గమనార్హం.

పవన్ ఔదార్యం
దేశమంతటా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ కట్టడి చర్యల్ని ముమ్మరం చేసింది. వైద్య సదుపాయలను మెరుగుపర్చడంతోపాటు, లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద వర్గాలకు అండగా పలు ప్యాకేజీలు ప్రకటించాయి. ప్రభుత్వాలు చేస్తున్న పనులకు తన వంతు సాయంగా పవన్ పెద్ద మనసు చాటుకున్నారు. కేంద్రానికి రూ.1కోటి, రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించడం తెలిసిందే. ఈ సందర్భంగా జనసేనాని, మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్ లో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

కొత్తగా వద్దు.. పాతవరసే ముద్దు..
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు పవన్ రూ.50 లక్షలు ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ.. ‘‘గొప్ప సందేశం ఇచ్చారు అన్నా..''అని మంత్రి కేటీఆర్ కితాబిచ్చారు. అందుకు పవన్.. ‘‘థ్యాంక్యూ సార్.. ఇలాంటి కష్టకాలంలో కేసీఆర్ నాయకత్వంలో మీరంతా బాగా పనిచేస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నారు''అని రిప్లై ఇచ్చారు. దీనిపై కేటీఆర్ మళ్లీ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్స్ అన్నా.. కానీ మీరు ఎప్పటి నుంచి నన్ను సార్ అనడం మొదలుపెట్టారు? దయచేసి ఎప్పటిలాగే బ్రదర్ అని పిలవండి''అని విన్నవించుకున్నారు. దీనికి వెంటనే పవన్ ‘సరే బ్రదర్'అని రిప్లై ఇచ్చారు.

జగన్కు జనసేనాని వినతి
సాధారణంగా సీఎం జగన్ పై తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకుపడే జనసేనాని పవన్ కల్యాణ్.. కరోనా కల్లోలంతో డోసును తగ్గించారు. సాధ్యమైనంత తక్కువ విమర్శలతో ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ నుంచి ‘నో అబ్జెక్షన్ పత్రాల'తో వచ్చిన ఏపీ పౌరుల్ని సరిహద్దు దగ్గరే ఆపేసి ఇబ్బంది పెట్టడాన్ని పవన్ తప్పుపట్టారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందే సంయమనంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉత్సన్నమయ్యేది కాదన్నారు.

సౌకర్యాల లేమిపై నిలదీత..
కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బందిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న పవన్ కల్యాణ్.. ఏపీలోని ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది అందరికీ ఎన్95 మాస్కులు అందుబాటులేవని, ఆ కొరత తీర్చడంతోపాటు ల్యాబ్స్ సంఖ్య పెంచాలని చెప్పారు. అలాగే, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలోని అన్ని ఊళ్లలో కూరగాయలు, కిరాణా షాపుల వద్ద జనం గుమ్మికూడుతున్నారని, దీన్ని నివారించడానికి ప్రజల ఇళ్ల వద్దకే సరుకులు చేర్చే ఏర్పాట్లు చేయాలని సీఎంకు పవన్ సూచించారు.












Click it and Unblock the Notifications