ఐఆర్సీటీసీ ఐడీతో వేరేవారికి టికెట్లు బుక్ చేస్తే జైలే!
ప్రస్తుతం ఎక్కువమంది తమ ఐఆర్సీటీసీ ఐడీ ద్వారా ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేస్తున్నారు. ఒక్కోసారి బంధువులు, స్నేహితులకూ తమ ఐడీతో టికెట్లు తీసుకొని సాయం చేస్తుంటారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. ఈ తరహా విధానాన్ని రైల్వేశాఖ తీవ్రంగా ఖండిస్తోంది. వ్యక్తిగత ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. జైలుశిక్షతోపాటు భారీ జరిమానా విధించబోతోంది. దీనికి సంబంధించి బుకింగ్ నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పును స్పష్టంగా పేర్కొంది.
రైల్వే చట్టం సెక్షన్ 143 ప్రకారం.. కేవలం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ కింద టికెట్లు బుక్ చేసే అవకాశం ఉంది. వీరు మాత్రమే ఇతరులకు టికెట్ బుక్ చేస్తారు. ఈ నిబంధనను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నారు. మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదంటే రూ.10వేల జరిమానా లేదంటే జైలుశిక్షతోపాటు జరిమానా రెండూ విధించే అవకాశం ఉంది.

నిబంధనల ప్రకారం వ్యక్తిగత ఐడీతో కేవలం రక్త సంబంధీకులకు మాత్రమే ఇకనుంచి టికెట్లను బుక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్తో లింకు చేసుకున్న వినియోగదారుడు నెలకు 24టికెట్లు, ఆధార్ లింకు లేకుండా అయితే 12టికెట్ల ను బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా వినియోగదారుడితోపాటు అతడి కుటుంబీకులకే. వీరు కాకుండా స్నేహితులు, ఇతరులకు టికెట్ బుక్ చేస్తే రైల్వే చట్టం సెక్షన 143 నిబంధనను అతిక్రమించినట్లే. టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు, పారదర్శకత కోసమే రైల్వేశాఖ ఈ నిబంధన తీసుకు వచ్చింది.
ఈ నిబంధనవల్ల చాలామంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. చాలామంది ఐఆర్ సీటీసీకి అధీకృత ఏజంట్లు అవకుండా తమ వ్యక్తిగత ఐడీతో ఇతరులకు కమీషన్ కింద టికెట్లు కొడుతున్నారు. ఈ తరహా చర్యలు పాల్పడేవారందరికీ రైల్వే శాఖ తీవ్ర షాక్ ఇచ్చింది. టికెట్లు కావాలంటే రిజర్వేషన్ కౌంటర్ కు, ఏజంట్ దగ్గరకు ఇకనుంచి వెళ్లాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications