ఎందుకలా: పార్టీ నేతలపై చంద్రబాబు పట్టు కోల్పోతున్నారా?
హైదరాబాద్: పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు కోల్పోతున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రభుత్వపరంగా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను ఎదుర్కుంటున్న చంద్రబాబు పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించలేని పరిస్థితి ఉందని అంటున్నారు. దీంతో కొంత మంది నాయకులు దాన్ని ఆసరా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇసుక రీచ్లో విషయంలో శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ వ్యవహారశైలి, మంత్రి పీతల సుజాత వ్యవహారం ఆ కారణంగానే చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు అటువంటివారిపై మండిపడడం తప్ప వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, నిమ్మల కిష్టప్ప వంటివారు చంద్రబాబు ప్రమేయం లేకుండానే తీవ్రమైన వ్యాఖ్యల దాడి చేసినట్లు భావిస్తున్నారు.
పైకి చంద్రబాబు మాటే శాసనమని అనిపించినప్పటికీ లోపల వ్యవహారాలు దానికి తగినట్లుగా లేవని అంటున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్తో తెలుగుదేశం ఎంపీలు వివాదానికి దిగడం, ఇసుక రీచ్ వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దూకుడు అందుకు నిదర్శనంగా చెబుతున్నారు.

ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పట్ల చింతమనేని ప్రభాకర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఇది చంద్రబాబుకు తలనొప్పిగానే మారింది. దాన్ని చక్కదిద్దడానికి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అందుకు చంద్రబాబు కూడా పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
పార్టీ వ్యవహారాలను చంద్రబాబు తనయుడు నారా లోకేష్ చూస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. అయితే, ఆయన అనుభవ లేమి కూడా ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తుందనే అభిప్రాయం ఉంది. నారా లోకేష్ వ్యవహారాలను ఏ మేరకు చక్కదిద్దగలరనేది ఇంకా సందేహంగానే ఉంది.
ప్రభుత్వపరంగా ఓ వైపు చంద్రబాబుకు ఊహించని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఇంతకు తుఫాను, తాజాగా పుష్కరాల్లో తొక్కిసలాట వంటివి కూడా ఆయనను ఎప్పటికప్పుడు ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. రాజధాని లేకపోవడం, ఆర్థిక లోటు అతి పెద్ద సమస్యలుగా ఉంటే, అనుకోని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు కూడా ఆయనను చుట్టుముడుతున్నాయి.












Click it and Unblock the Notifications