టీడీపీ వర్సెస్ బీజేపీ దొంగాట: ఏపీకి నిధుల విడుదలపై కేంద్రం డొల్లతనం
హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంతోపాటు, ఆ బిల్లుపైన పార్లమెంటులో చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీల్లో 85 శాతం నెరవేర్చామని బీజేపీ చెబుతోంది. కానీ అవన్నీ డొల్ల లెక్కలేనని టీడీపీ వాదిస్తోంది. విభజన హామీలను నెరవేర్చేందుకు పదేళ్లు గడువు ఉన్న మాటెలా ఉన్నా కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరే సందేహస్పదంగా కనిపిస్తున్నది. రాజ్యసభ వేదికగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కేబీకే, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ అమలు గానీ, ఐదేళ్ల పాటు రాష్ట్ర బడ్జెట్ లోటు భర్తీ చేసే విషయంలో గానీ కేంద్రం కప్పదాట్లకు పాల్పడుతున్నదా? అన్న సందేహాలకు తావిచ్చేలా ఆ పార్టీ ప్రతినిధులే చెప్పిన గణాంకాలు పేర్కొంటున్నాయి.
Recommended Video

మూడున్నరేళ్లపాటు లోటు బడ్జెట్ నిధులు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, కేబీకే ప్యాకేజీల మాదిరిగా నిధులు విడుదల చేయకున్నా ఏపీ సర్కార్ ఎందుకు మిన్నకున్నదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్, వామపక్షాలను అణచివేసేందుకు ప్రయత్నించిన టీడీపీ.. ఇప్పుడు పోరాట బాట పట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నా.. అనుకూల మీడియా ద్వారా ప్రచారం భారీగా చేయించుకున్నా.. ఆంధ్రులను మోసగించేందుకు పూనుకోవడం ఏమాత్రం క్షంతవ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

2014లో పార్లమెంట్లో ఇలా చర్చ
2014-15లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని అకౌంటెంట్ జనరల్ ధ్రువీకరించారని అధికార టీడీపీ చెబుతోంది. తద్భిన్నంగా కేంద్రం మాత్రం ఈ లోటు రూ.4,117.89 కోట్లేనని వాదిస్తుండటం గమనార్హం. అదీ కూడా 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకేనని కేంద్రం, బీజేపీ నమ్మబలుకుతున్నాయి. గత మూడున్నరేళ్లుగా ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటా ప్రకారమే కేంద్రం నిధులు కేటాయించిందే తప్ప ప్రత్యేకంగా ఏమీ మేలు చేకూర్చలేదని టీడీపీ వాదిస్తున్నది. వాస్తవంగా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారమే రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఐదేళ్ల పాటు భర్తీ చేయాలని నిర్ణయం జరిగినట్లు సమాచారం. దీనికోసం ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. నాడు రాజ్యసభలో బీజేపీ ఎంపీగా కేంద్రం ముందు పట్టుబట్టినట్లు వార్తలొచ్చాయి.

మూడున్నరేళ్లలో ఏపీకి కేటాయింపులు రూ.1,050 కోట్లే
ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన ఏడు జిల్లాలకు ఒడిశాలోని కోరాపుట్ - బోలంగిర్ - కలహండి తరహాలో స్పెషల్ ప్లాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ల్లోని బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారు. కానీ కేంద్రం, బీజేపీ ఒక్కో ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక అభివ్రుద్ధి ప్యాకేజీ కింద వెనుకబడిన ఏడు జిల్లాల ప్రగతి కోసం రూ.1,050 కోట్ల నిధులు కేటాయించామని వాదించింది. కానీ ఏడు జిల్లాలకు కలిపి రూ.24,350 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, కేవలం రూ.1050 కోట్లు విదిల్చారని టీడీపీ ఎదురుదాడికి దిగింది. బుందేల్ ఖండ్ ప్యాకేజీ కింద రూ.7,266 కోట్లు, 2016లో కరువు నివారణ ప్యాకేజీ కింద బుందేల్ ఖండ్కు రూ.7277 కోట్లు కేటాయించారని టీడీపీ గుర్తు చేసింది.

వర్శిటీల నిర్మాణానికి రూ.1500 కోట్లు అవసరమన్న టీడీపీ
అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసింది రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ.. అయితే ఆ ఘనత బీజేపీ తన ఖాతాలో కలిపేసుకున్నది. తాజా బడ్జెట్లో ఈ రెండు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు చెరో రూ.10 కోట్లు కేటాయించామని బీజేపీ ఘనంగా చెప్పుకున్నది. కేంద్రీయ యూనివర్సిటీ నిర్మాణానికి రూ.1100 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణానికి రూ.400 కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వ వాదన. వీటికి కేటాయించిన స్థలాలు, ప్రహరీ గోడల నిర్మాణం విలువే రూ.1026 కోట్లని ఏపీ సర్కార్ చెబుతోంది.

నోరు మెదపని ఏపీ సర్కార్
గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్పై ఏర్పాటు విషయమై ఎటువంటి పురోగతి లేకపోగా, ఆర్థిక సర్దుబాటు కింద కేంద్రం రూ. 5 కోట్లు కేటాయించాల్సి ఉన్నా ఆ ఊసే లేదు. కానీ దానికి భిన్నంగా కాకినాడ గ్రీన్ ఫీల్డ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్లో హెచ్ఫీసీఎల్, గెయిల్ రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 2017 భాగస్వామ్య సదస్సులో ఎంవోయూపై సంతకాలు చేశాయని కేంద్రం వాదన. దీనిపై మాత్రం ఏపీ సర్కార్ నోరు మెదపక పోవడం గమనార్హం.

సాంకేతిక సాకులు చెబుతున్న బీజేపీ
దుగరాజపట్నంలో నౌకాశ్రయాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్దతుల్లో చేపట్టడానికి కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపినా సాంకేతిక కారణాల రీత్యా సాధ్యం కాలేదని బీజేపీ వాదిస్తున్నది. బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు హరిబాబు కథనం ప్రకారం రక్షణ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరోచోట నౌకాశ్రయం ఏర్పాటు చేస్తామని కేంద్రం వాదిస్తున్నది. దీనిపై కేంద్రం సాంకేతిక కారణాలను సాకుగా చూపుతున్నదని టీడీపీ విమర్శిస్తున్నది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటునకు సాధ్యాసాధ్యాలపై సెయిల్ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. అందులోని అంశాల పరిశీలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ఆర్ఐఎన్ఎల్, ఎన్డీఎంసీ, మెకాన్, ఎంఎస్టీసీల సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. సాధ్యమైనంత త్వరలో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుందని తాజాగా కేంద్రం మరోసారి హామీ గుప్పిస్తోంది. కానీ లాభసాటి కాదని నివేదికను పక్కనబెట్టారని టీడీపీ విమర్శిస్తున్నది.

రాజధాని నిర్మాణంపై చేతులెత్తేసిన కేంద్రం
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం పంపిన సవివర ప్రాజెక్టు నివేదిక ఇంకా కేంద్ర పట్టణాభివ్రుద్ధిశాఖ పరిశీలనలోనే ఉన్నదని వాదిస్తోంది. కొన్ని వివరణలు ఇవ్వాలని ఏపీ సర్కారును కేంద్రం కోరిందని బీజేపీ వాదన. అంతే కాదు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సూత్రప్రాయ అంగీకారం తెలిపామని కేంద్రం తెలిపినట్లు తెలుస్తున్నది. కానీ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి సంధించిన ప్రశ్నకు కేంద్రం అసలు మెట్రో రైలు ప్రాజెక్టు ఊసే లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంపై అటు బీజేపీ.. ఇటు టీడీపీ ఏపీ వాసులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.1,500 కోట్లే ఇచ్చారని టీడీపీ ఆరోపించింది. ఆ నిధులతో 6 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించామని, 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధికారులు, సిబ్బంది నివాస భవనాలు, రహదారులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపింది. రాజభవన్, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి రాబోయే అయిదేళ్లలో రూ.42,395 కోట్లు అవసరమవుతాయన్నది ఏపీ సర్కార్ అంచనా. వీటి సవివర ప్రాజెక్టు నివేదికలు కూడా కేంద్రానికి సమర్పించామని టీడీపీ వాదిస్తున్నది. అయితే బీజేపీ, కేంద్రం మాత్రం కుండబద్దలు కొట్టేశాయి. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు విడుదల చేశామని, త్వరలో మరో రూ.1000 కోట్లు ఇస్తామని బీజేపీ చెబుతోంది.

విద్యాసంస్థల నిర్మాణానికి మూడేళ్లలో రూ.730 కోట్లు విడుదల
ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీడీఎం, ఐఐఎస్ఈఆర్, ఐఐఎం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐపీఈ, ఎయిమ్స్, ఎన్ఐడీఎం తదితర విద్యాసంస్థల తాత్కాలిక ప్రాంగణాల్లో ఇప్పటికే తరగతులు కొనసాగుతున్నాయని కేంద్రం చెబుతోంది. జాతీయ విద్యాసంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ నిర్మాణానికి గత రెండేళ్లలో రూ.730.51 కోట్లు విడుదల చేశామని బీజేపీ వాదన. కానీ టీడీపీ వాదన అందుకు భిన్నంగా ఉంది. ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.9,654.95 కోట్ల వ్యయం అవుతుందని ఏపీ సర్కార్ వైఖరి. ఇప్పటివరకూ కేంద్రం రూ.680.08 కోట్లే విడుదల చేసిందని, దీని ప్రకారం ఏడు శాతం నిధులే విడుదల చేసిందని, ఈ లెక్కన చూసుకుంటే వాటి నిర్మాణం పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందని టీడీపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణానికి కేటాయించిన స్థలం విలువ, దాని చుట్టూ ప్రహారీ నిర్మాణానికి చేసిన వ్యయమే రూ.11,182.38 కోట్లని టీడీపీ ఎదురుదాడికి దిగింది. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని, విజయవాడను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తోందని బీజేపీ వాదిస్తున్నది. ఇప్పటికే కొత్త టెర్మినల్ భవనం పూర్తయ్యింది. రన్వే విస్తరణ సాగుతోందని చెబుతున్నది. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి అభివృద్ధి చేసిన తిరుపతి విమానాశ్రయాన్ని ఇప్పటికే ప్రధాని ప్రారంభించారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రాత్రి ల్యాండింగ్, రన్వే విస్తరణ పనులు సాగుతున్నాయని, కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనం ప్రారంభమైంది ఉడాన్ పథకం కింద ఇక్కడి నుంచి సర్వీసులు నడుస్తున్నాయని బీజేపీ, కేంద్రం వాదిస్తున్నాయి. కానీ కడప, రాజమహేంద్రవరం విమానాశ్రయాల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయన్నది టీడీపీ విమర్శగా ఉంది.

అంచనాలే తప్ప వివరాలేవని నిలదీసిన టీడీపీ
2009-14 మధ్య రైల్వేకు అప్పటి యూపీఏ ప్రభుత్వం రూ.5,100 కోట్లు కేటాయిస్తే, 2014-19లో రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు రూ.14,151 కోట్లు కేటాయించామని, రూ.47,989 కోట్ల విలువైన 5,010 కి.మీ. 32 ప్రాజెక్టులు ఇప్పటికే పని జరుగుతోందని బీజేపీ చెప్పుకొచ్చింది. నాలుగేళ్లలో రూ.14,151 కోట్లు కేటాయిస్తే రూ.47,989 కోట్ల విలువైన పనులు ఎక్కడ జరుగుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. వివిధ ప్రాజెక్టు అంచనాలు, అవసరమైన నిధుల గురించి చెప్పారే తప్ప ఇప్పటివరకూ ఎన్ని మంజూరు చేశారు? ఇంకా ఎంత విడుదల చేయాలనేది చెప్పలేదని టీడీపీ గుర్తు చేస్తున్నది. జాతీయ రహదారులు, రోడ్ల ఇంటర్ లింకింగ్ కోసం రూ.లక్ష కోట్లు నిధులు ఖర్చు చేస్తామని కేంద్రం వాదిస్తున్నది. 180 కి.మీ అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు రూ.20 వేల కోట్లును కేంద్రమే భరిస్తుందని బీజేపీ చెబుతున్నది. ఇతర రాష్ట్రాలకు కేటాయించినట్లే ఆంధ్రప్రదేశ్కూ నిధులు కేటాయించారని టీడీపీ వాదిస్తోంది. ఇక అనంతపురం-అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి భూ సేకరణ జరుగుతోందని, ప్రాజెక్టు అంచనా రూ.25 వేల కోట్లు. బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, భూసేకరణకయ్యే వ్యయాన్ని రాష్ట్రమే భరిస్తోందని టీడీపీ చెప్పుకొచ్చింది. కేంద్రం భరిస్తుందని చెబుతున్న అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ఇంకా డీపీఆర్ దశలోనే ఉందని ఏపీ సర్కార్ గుర్తు చేసింది.

కేంద్రం నాన్చుడు వల్లే రెండు నెలలు ఆలస్యం అని టీడీపీ వాదం
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.4,622.68 కోట్లు చెల్లించామని.. 2014 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణానికయ్యే వ్యయమంతా తామే భరిస్తామని కేంద్రం వాదిస్తున్నది. కానీ 2014-15 అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.54 వేల కోట్ల వ్యయమవుతుందని ఆగస్టు 2016న కేంద్రానికి నివేదిక పంపామని టీడీపీ ఎదురు దాడి చేస్తోంది. దీనిలో పరిహారం, పునరావాసానికి రూ.33 వేల కోట్లువుతుందని, దానిపైన స్పష్టత ఇవ్వలేదు. నాలుగేళ్లలో పోలవరంపై రూ.7,780.07 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్రం వెచ్చించిన మొత్తంలో ఇంకా రూ.3,451 కోట్లు కేంద్రం నుంచి రావాలని ఏపీ సర్కార్ వాదిస్తున్నది. ఫలితంగా వడ్డీ రూపంలో రూ.300 కోట్లమేర ఏపీపైన భారం పడిందని ఎగువ కాఫర్ డ్యామ్, స్పిల్వే, స్పిల్ ఛానల్ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణితో ప్రాజెక్టు పనుల్లో రెండు నెలలు ఆలస్యమైందని చంద్రబాబు సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇక ప్రత్యేక హోదా ఎత్తేసిన కేంద్రం.. ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చి ఏడాదిన్నర దాటినా ఆ ఊసే ఎత్తకపోవడం ఆసక్తికర పరిణామం. బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ నిరసన, ఇతర పక్షాల మద్దతుతో మెట్టు దిగన కేంద్రం.. విత్త మంత్రి అరుణ్ జైట్లీ నిష్ఠూరమే అయినా వాస్తవాలు బయట పెట్టారు. ఏపీ సర్కార్కు లోటు బడ్జెట్ బకాయిలు ఒకేసారి చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, ఇతర నిధులు సకాలంలో వచ్చేలా చూస్తామని హామీలు ఇచ్చారే గానీ, వాటి అమలు సంగతి నాస్తి. ఎందుకంటే పార్లమెంట్ లోపల సానుభూతి ఉన్నదని, పరిశీలిస్తామని రకరకాల కబుర్లు చెప్పిన జైట్లీ.. నిబంధనల అడ్డంకి వల్లే సభలో చెప్పలేకపోయామని అన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అసలు వాస్తవమేమిటంటే పార్లమెంట్లో ప్రకటన చేస్తే నిబద్ధతతో కట్టుబడి వాటి అమలుకు పని చేయాల్సిందే. అందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా? లేదా? అన్న సంగతిని జైట్లీ చెప్పిన ‘నిబంధనల అడ్డంకి' మాటలే తేల్చేస్తున్నాయి. ఇటు నిరసన పేరుతో టీడీపీ.. అటు అమలు చేస్తామని పేరుతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ వాసులను నమ్మించి మోసగించేందుకు పూనుకున్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications