పవన్ కళ్యాణ్ పవరెంతో...చూద్దామనే ధోరణిలో టిడిపి ప్రభుత్వం!
శ్రీకాకుళం: వైద్యఆరోగ్య శాఖా మంత్రిని 48 గంటల్లో నియమించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ టిడిపి ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ మరికొద్ది సేపట్లో ముగియనుంది.
అయితే ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం పవన్ కల్యాణ్ ప్రకటనను లైట్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరి తాను ఆమరణ దీక్ష చేస్తానన్నా టిడిపి ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఈ విషయంపై పవన్ ఎలా ప్రతిస్పందిస్తారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో తాను ప్రకటించిన విధంగానే పవన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా?...లేదా?...అనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. టిడిపి మాత్రం పవన్ పవరెంతో చూద్దామని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

అసలు పవన్...ఏమన్నాడు?
శ్రీకాకుళం పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ సమస్య గురించి మాట్లాడుతూ దీనిపై 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే...ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ఎపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెండంటే 2 రోజుల్లో...ఉన్నతస్థాయి కమిటీ వేసి చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే ఆరోగ్యశాఖ మంత్రిని నియమించాలని పవన్ డెడ్ లైన్ పెట్టారు. పవన్ ఇక్కడి ప్రకటన చూస్తే ఉద్దానం కిడ్నీ సమస్యపై స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారా లేక ఆరోగ్య వాఖా మంత్రిని నియమించకుంటేనా అనే విషయంపై అస్పష్టత ఉంది. అయితే పవన్ ఆల్టిమేటం నేపథ్యంలో ప్రభుత్వం ఈ రెండు విషయాలపై స్పందించకపోవడంతో ఇప్పుడు పవన్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాల్సిన ఆవశ్యకత అనివార్యమైంది.

ప్రభుత్వం...లైట్ తీసుకుంది...
పవన్ సమస్య పరిష్కారం కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని డెడ్ లైన్ విధించినా ప్రభుత్వం కనీసం స్పందించక పోవడం వెనక రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పవన్ ప్రకటనకు స్పందిస్తే తామే అతడికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వారమౌతామని, రాజకీయంగా పవన్ మైలేజీ తామే పెంచినట్లు అవుతుందనే కారణంతో టిడిపి ప్రభుత్వం పవన్ హెచ్చరికను బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. అందుకే పవన్ ప్రకటనపై కనీస స్పందించకుండా తాము గతంలోనే తగిన చర్యలు తీసుకున్నట్లు సాక్షాత్తూ ముఖ్యమంత్రి తనయుడు,మంత్రి లోకేష్ ప్రకటించి సరిపుచ్చేశారు.

టిడిపి ప్రభుత్వం...ఎందుకిలా?
సార్వత్రిక ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో మిత్రుడు నుంచి శత్రువుగా మారిన పవన్ సత్తా ఏంటో తేల్చుకునేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలని టిడిపి అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గతంలో లాగా పవన్ ప్రకటనపై గతంలోలాగా ఆఘమేఘాల మీద అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చర్యలు చేపట్టే చందంగా కాకుండా పూర్తి భిన్నంగా స్పందించింది. పవన్ తమకు ప్రత్యర్థి కావడం వల్ల రాబోయే ఎన్నికల్లో అతడి వల్ల జరగబోయే నష్టం ఎంతుంటనేది అంచనా వేసేందుకు ఈ సిట్యుయేషన్ ను టిడిపి వాడుకోకున్నట్లు తెలుస్తోంది. అసలు పవన్ తాను ప్రకటించిన విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా? లేదా?...చేస్తే ఏమవుతుంది?...ప్రజల్లో స్పందన ఎలా ఉంటుంది? అనే విషయాలు ఈ సందర్భంతో అవగాహనకు రావాలనేది టిడిపి వ్యూహంగా కనిపిస్తోంది.

పవన్ సత్తా...తేలిపోనుందా?
అంతేకాదు పవన్ తన శక్తిని ఎక్కువగా ఊహించుకుంటున్నారని భావిస్తున్న టిడిపి నేతలు ఈ విషయంతోనే పవన్ శక్తిసామర్థ్యాలు ఏమిటో తాము తెలుసుకోవడంతో పాటు అతనూ తెలుసుకునేలా చేయాలని భావిస్తున్నట్లు కొందరు టిడిపి నేతల వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. మరోవైపు తన సెక్యూరిటీ సిబ్బందికి గాయాలు కావడంతో నిన్న పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు గాయాల నుంచి కోలుకోకపోవడంతో శుక్రవారం కూడా పవన్ తన యాత్రకు విరామం ఇచ్చారు. అయితే ఈ విరామంలో పవన్ తన వైపు నుంచి ఖచ్చితంగా 48 గంటల హెచ్చరికపై తన వ్యూహం కూడా సిద్దం చేసుకొని తదుపరి కార్యాచరణకు సిద్దమవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొందరైతే పవన్ ఈ అంశంపై నిర్ణయం కోసమే ఈ విరామం తీసుకొని ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ పై నుంచి శుక్రవారమే తదుపరి కార్యాచరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications