పెద్దిరెడ్డి-రోజా: ఆ జిల్లా రాజకీయాలు నివురు గప్పిన నిప్పేనా: మారిన వర్గ సమీకరణాలు
చిత్తూరు: చిత్తూరు జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణమాలు చోటు చేసుకున్నాయి. సమీకరణాలు హఠాత్తుగా మారిపోతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి-ఆర్కే రోజా వర్గాల మధ్య మొన్నటిదాకా నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెర పడినట్టే కనిపిస్తోంది. ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్యను కుదిర్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు. రోజాను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా పెద్దిరెడ్డితో సమానంగా ప్రాధాన్యతను ఇచ్చినట్టయిందనే సంకేతాన్ని పంపించినట్లు భావిస్తున్నారు.
పెద్దిరెడ్డి ఆశీర్వాదం తీసుకున్న రోజా..
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రోజా.. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి పాదనమస్కారం చేయడం, ఆయన ఆశీర్వాదాన్ని తీసుకోవడంతో- వారి మధ్య విభేదాలు తొలగిపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇది తాత్కాలికమేనని- ఈ ఇద్దరి మధ్య సంబంధాలు నివురుగప్పిన నిప్పులా మారుతాయనే వాదన కూడా లేకపోలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఈ సంబంధాలు మళ్లీ మొదటికొస్తాయనే అంచనాలు అప్పుడే వెలువడుతున్నాయి కూడా.
చిత్తూరు రాజకీయాలపై పట్టు కోసం
చిత్తూరు జిల్లా రాజకీయాలపై సీనియర్ నేత, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి గట్టి పట్టు ఉంది. దీన్ని ఆయన పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు కూడా. ప్రత్యేకించి- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జిల్లాలో ఆయన ప్రభంజనం వీచింది.
దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. చివరికి తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంపైనా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పాతింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థులను బరిలోకి దింపి, వారిని గెలిపించుకున్నారు పెద్దిరెడ్డి.
నగరిపైనా..
అత్యంత సీనియర్ నేత కావడం వల్ల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపైనా పట్టు సాధించారు. తనదైన ముద్ర వేశారు. నగరి నుంచి మాత్రం కొంత ప్రతిఘటన ఎదురైంది. స్థానిక ఎమ్మెల్యే రోజా వర్గం- పెద్దిరెడ్డి పెద్దరికాన్ని కొంత అడ్డుకోవడానికి ప్రయత్నించింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇది బహిర్గతమైంది కూడా. తన నియోజకవర్గం పరిధి వరకు తాను నిలబెట్టిన అభ్యర్థులను ఓడించడానికి సొంత పార్టీ నాయకులే ప్రయత్నించారంటూ రోజా స్పందించడం దీనికి నిదర్శనం.
చివరి నిమిషం వరకూ..
ఇదే విషయాన్ని రోజా ఒకట్రెండు సందర్భాల్లో వైెఎస్ జగన్ వద్దకు కూడా తీసుకెళ్లారు. సొంత నియోజకవర్గంలో తాను ఎదుర్కొంటోన్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. అప్పట్లో ఆమెకు స్వేచ్ఛగా నిర్ణయాలను తీసుకునే అవకాశం కల్పించారు వైఎస్ జగన్. రోజాను కేబినెట్లోకి తీసుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వర్గం చివరి వరకు ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. పైగా ఒకే జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవడం కూడా సరికాదని, రోజాకు మంత్రిగా అవకాశం దక్కకపోవచ్చనే వార్తలు సైతం వెలువడ్డాయి.
రోజాకు న్యాయం..
రోజా తన మాట వినట్లేదని, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటోందనే ఒకే ఒక్క కారణంతో పెద్దిరెడ్డి వర్గం కొంత అసంతృప్తి ఉందనే ప్రచారం జిల్లాలో వినిపించేది. ఇప్పుడు ఆ వార్తలు, ఆ ప్రచారానికి కొంత తెరపడినట్టే కనిపిస్తోంది. రోజాను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా వైఎస్ జగన్ ఆమెకు న్యాయం చేశారని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నుంచి రోజా తీవ్ర ఇబ్బందులు, అవమానాలు మరెవరూ ఎదుర్కొనలేదని, వాటన్నింటినీ గుర్తించే జగన్ కేబినెట్ బెర్త్ కల్పించారని ప్రచారం జిల్లాలో ఉంది.
సమసిపోయాయా..నివరు గప్పాయా?
ప్రమాణ స్వీకారం అనంతరం రోజా- పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వద్దకు వెళ్లి పాదనమస్కారం చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతే ఆప్యాయంగా పెద్దిరెడ్డి కూడా రోజాను ఆశీర్వదించారు. దీనితో ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడిందనే భావిస్తున్నారు. మంత్రిగా పని చేయాలనే రోజా లక్ష్యం నెరవేరడం వల్ల ఇక ఆమె గానీ, ఆమె వర్గం గానీ- పెద్దిరెడ్డి వర్గంతో ఘర్షణ వైఖరికి దిగకపోవచ్చనీ అంటున్నారు.