ఎపిలో బిజెపి పరిస్థితి ఇదేనా...అందుకేనా ఈ ఎమ్మెల్యే ఇలా...
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఏంటో ఎవరూ చెప్పలేరు...కేంద్రంలో అధికారంలో ఉండి రాష్టంలో అధికారపార్టీకి మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఎపిలో ప్రస్తుత స్థితి చూస్తే విచిత్రంగా అనిపించక మానదు.
మూర ముందుకు...బారెడు వెనక్క అనే సామెత తమ పార్టీకి అతికినట్లు సరిపోతుందని బిజెపి ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోంది. అందుకే ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యే తన భవిష్యత్తు గురించి ఆలోచించి స్వంత నిర్ణయం తీసుకున్నాడు...తీసుకొని ఏం చేశాడు? ఎవరా ఎమ్మెల్యే? తెలుసుకోవాలంటే...చదవండి మరి...
ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పరిస్థితి గురించి వర్ణించడానికి ఎన్ని సామెతలైనా సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రాలో ఆ పార్టీ పయనం చుక్కాని లేని నావ లాగా ఉందంటే అంగీకరించక తప్పని వాస్తవం. ఎపిలో ఆ పార్టీలో ఉన్న ప్రముఖ నాయకుల సంఖ్య మిగతా పార్టీలతో పోలిస్తే ఇప్పటికీ చాలా తక్కువే. అయినా వీళ్లలో వీళ్లకే పది గ్రూపులా అన్నట్లుంటుంది పరిస్థితి.
ఒకరు ఒక ప్రకటన చేస్తే మరొకరు అందుకు భిన్నమైన స్టేట్ మెంట్ ఇస్తారు. ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులది చెరోదారి. ఇద్దరు ఎంపీల్లో ఎవరి దారి వారిదే...పోనీ ఈ పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందా అంటే నాలుగేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లాంటి స్థితి. మరి ఇలాంటి స్థితిలో నా పరిస్థితి ఏంటి అని ఆలోచించినట్లున్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. పార్టీలో ఉంటూనే తన దారి తాను చూసుకుంటున్నారు.
మళ్లీ గెలవాలి..
కారణాలేమైనప్పటికి ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ విచిత్ర పరిస్థితిలో ఉండటం రాజమండ్రి సిటీ బీజేపీ ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణను ఆలోచనలో పడేసింది. రాజమండ్రిలో మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలనేది ఆయన కోరిక. కేంద్రంలో అధికార పార్టీ...రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం...వెరసి బిజెపి ఎపిలో కొంతైనా బలపడుతుందని ఆశించారు. అయితే నాలుగేళ్లు గడచినా బలుపు కాదు కదా వాపు కూడా కనిపించని స్థితే. అందుకే కేవలం పార్టీనే నమ్ముకొని కూర్చుంటే పుట్టి మునగడం ఖాయమని నిర్ణయించుకున్నట్లున్నారు. అందుకే సొంత బాట పట్టారు.
గతంలో ఇలా జరిగింది...
గతంలో గుండె గుండెకు బీజేపీ అనే కార్యక్రమం ప్రకటించి జనాల్లోకి వెళ్లినా ఏ మాత్రం స్పందన రాలేదనే పాత విషయాన్ని కొత్తగా గుర్తు తెచ్చుకున్నారు. మళ్లీ గెలవాలనే తన కోరిక నెరవేరాలంటే పార్టీ మీదే ఆధారపడితే లాభం లేదనుకున్నారు. ఈసారి అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగేశారు. మీ ఇంటికే మీ ఎమ్యెల్యే అనే పేరుతో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభించేశారు.
కారణం ఏంటంటే...
టిడిపి తమకు మిత్ర పక్షమైనా ఆ పార్టీ ఎమ్మెల్యే తనతో మిత్రుడిలా కాదు కదా కనీసం తటస్థంగా కూడా ఉండని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ , రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొదట్నుంచి ఉప్పు నిప్పులాగే వ్యవహరిస్తున్నారు. ప్రొటొకాల్ వివాదాలు మొదలు కొని సరిహద్దు వివాదాల దాకా అనేక విషయాల్లో నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు.
అందుకే ఇలా...
అందుకే ఇక మీనమేషాలు లెక్కిస్తే లాభం లేదని వాస్తవ పరిస్థితులను అవగతం చేసుకొని కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించారు. రాజమండ్రి సిటీ పరిధిలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేపట్టారు. ఆ రకంగా ప్రచారం ప్రారంభించి రాబోయే ఎన్నికల యుద్ధానికి సన్నధ్దమవుతున్నారు.
మిగిలిన వారికి స్ఫూర్తి...
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ నిర్ణయం ఆ పార్టీలో చర్చనీయాశం అయింది. ఎప్పట్లానే కొందరు సమర్ధించగా మరికొందరు వ్యతిరేకించారు. పార్టీ పేరిట కాకుండా ఇలా సొంత బ్యానర్ మీద ప్రచారం చేసుకోవడం తగదనేది పార్టీలోని విమర్శకుల వాదన. అసలంటూ ఏమీ చెయ్యకుండా ఉండే కంటే యాక్టివ్ గా పనిచెయ్యడం,ప్రచారం చెయ్యడం అంతిమంగా పార్టీకే లాభం కదా అనేది అనుకూల వర్గం వాదన. ఏదేమైనా ఆకుల కార్యక్రమం ఆ పార్టీ నేతలతో పాటు మిగతా పార్టీ నాయకుల్లోనూ స్పూర్తి రగిలించిందట. తాము కూడా ఆ రకంగా ముందుకు పోవడం మేలని మిగతా నాయకులు యోచిస్తున్నారట. సో...ఆ విధంగా ఆకుల సత్యనారాయణ తన కార్యక్రమం ఆరంభంతోనే ఒక విజయాన్ని నమోదుచేసుకున్నట్లే.