విజయవాడ - గుంటూరు రాజధాని కాబోతుంది: నాని
హైదరాబాద్: త్వరలో విజయవాడ - గుంటూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కాబోతుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు! ఈ నెల ఆఖరున శివరామకృష్ణన్ కమిటీ ఏపీ రాజధాని పైన తుది నివేదిక ఇస్తుందన్నారు.
13 జిల్లాలకు మధ్యలో విజయవాడ - గుంటూరు నగరాలు ఉన్నాయని చెప్పారు. దీంతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. కాబట్టి గుంటూరు - విజయవాడ మధ్యనే రాజధాని ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విమానాశ్రయం, రైల్వే, ఆర్టీసీ, నీరుతో పాటు రాజధాని కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు విజయవాడలో ఉన్నాయని తెలిపారు. దాని పైన అపోహలు వద్దన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజధాని విషయంలో ఓ స్పష్టత ఉందని చెప్పారు.
రాష్ట్రం మధ్యలో.. బొజ్జల
ఎవరేమనుకున్నా ఆంధ్రప్రదేశ్కు మధ్యలోనే రాజధాని ఉంటుందని, ఈ విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి శనివారం సాయంత్రం చెప్పారు. గుంటూరులోని జిల్లా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేతరులతో మాట్లాడారు.
తమ ఇంటి పెరట్లో రాజధాని ఉండాలని కోరుకుంటున్నారని, అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం తగదని అన్నారు. గుంటూరు-విజయవాడ నడుమ రాజధాని ఉండాలన్నది రాష్ట్రంలో మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయంగా ఉందని తెలిపారు. ఇందుకోసం అవసరమైతే అటవీ భూములను డీనోటిఫై చేస్తామని చెప్పారు. రాజధాని విషయంలో కొందరు సెంటిమెంట్ను రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని మరోమారు ముక్కలుచేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.