జర్నలిస్ట్ తల నరికి యూట్యూబ్లో, అమెరికాకి హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు అమెరికాకు చెందిన ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ తల నరికి, ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టారు. ఎ మెసేజ్ టు అమెరికా అనే పేరుతో పెట్టిన ఆ వీడియోలో తమ అదుపులో మరో జర్నలిస్ట్ ఉన్నాడని సదరు తీవ్రవాద సంస్థ తెలిపింది. అమెరికా స్పందనను బట్టి అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపింది.
కాగా, ఉగ్రవాదుల చేతిలో బలైనతను 2012 నవంబర్ 22న కిడ్నాప్కు గురైన జేమ్స్ ఫోలీగా గుర్తించారు. మరో జర్నలిస్టు గతేడాది సిరియాలో కనిపించకుండా పోయిన స్టీవెన్ సాట్లాఫ్ అని తెలుస్తోంది. ఇరాక్లో అమెరికా చర్యలకు ప్రతిగానే జర్నలిస్టులను చంపినట్టు వీడియో వెల్లడిస్తోంది.
సోషల్ మీడియాలో పోస్టయిన ఈ వీడియోను తాము పరిశీలించామని అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి కైట్లిన్ హేడెన్ తెలిపారు. జర్నలిస్టు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
ఒక ఏడారి లాంటి ప్రాంతంలో జర్నలిస్ట్ జేమ్స్ పోలీని మోకాళ్ల మీద నిలబెట్టి పక్కనే నల్లని దుస్తుల్లో ముసుగు ధరించి ఆయుధంతో నిలబడ్డ తీవ్రవాదిని వీడియోలో చిత్రీకరించారు. మంగళవారం అప్ లోడ్ చేసిన ఈ వీడియోను తక్కువ సమయంలో ఎక్కువమంది చూశారు. ఆ తర్వాత దీనిని తొలగించారు. వీడియో నిజమైనదేనా, ఎవరు పెట్టారు తదితర విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది.