పిఎస్ఎల్వీ సీ 38 విజయవంతం, మోడీ అభినందన: ఐదేళ్ల పాటు కార్టోసాట్ సేవలు
శ్రీహరికోట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ38 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.
28 గంటల నిరంతర కౌంట్డౌన్ ప్రక్రియ అనంతరం ఈ రాకెట్ శుక్రవారం ఉదయం 9.29 గంటలకు అంతరిక్షంలోకి వెళ్లింది. ఇస్రో పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ మిషన్తో చేస్తున్న 17వ ప్రయోగం ఇది.
మన దేశానికి చెందిన కార్టోశాట్ 2ఈని ఈ రాకెట్ తీసుకెళ్లింది. ఇది ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. ఇతర దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను పిఎస్ఎల్వీ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. మొత్తం 31 ఉపగ్రహాలను తీసుకెళ్లింది.
ఉపగ్రహాలు ఇవే..
పీఎస్ఎల్వీ 38 కార్టోశాట్-2ఇ(712 కిలోలు)ను తీసుకెళ్లింది. తమిళనాడులోని నూరుల్ ఇస్లాం యూనివర్శిటీ విద్యార్థులు రూపకల్పన చేసిన ఉపగ్రహాన్ని తీసుకెళ్లింది. అలాగే, 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలు మోసుకెళ్లింది.
పీఎస్ఎల్వీ తీసుకెళ్లిన 30 నానో ఉపగ్రహాల బరువు 243 కిలోలు. ఈ ఉప్రగహాలను వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లి 55 కిలోమీటర్ల ఎత్తు ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెడుతుంది.