చిన్న సమస్య: మెట్రోపై గాడ్గిల్, మీడియాపై ఆగ్రహం
హైదరాబాద్: భారీ ప్రాజెక్టులు అన్న తర్వాత చిన్నచిన్న సమస్యలు సాధారణమేనని, తాము రాసిన లేఖ సాధారణమేనని, నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా మెట్రో రైలు పనులు ఆగిపోతుందని వార్తలు రాయడం సరికాదని ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్ బుధవారం అన్నారు. మెట్రో రైలు విషయమై వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాడ్గిల్ తెలంగాణ సీఎం కేసీఆర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. ఎన్వీఎస్ రెడ్డి తెలంగాణ సీఎస్తో రెండుసార్లు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా గాడ్గిల్ విలేకరులతో మాట్లాడారు. భారీ ప్రాజెక్టులు అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు సాధారణమే అన్నారు. తాను ఎవ్వరికీ సమాచారం ఇవ్వలేదన్నారు. మెట్రో ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అన్నారు. మెట్రో పనులు కొనసాగుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ పైన దుష్ప్రచారం చేయడానికి కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు రాస్తున్నాయన్నారు.
ఎన్ని సమస్యలు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరిస్తోందన్నారు. మీడియా ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాస్తే తాను ఎందుకు స్పందించాలని ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మెట్రో ఆగిపోతుందంటూ వచ్చిన కథనాలు దురదృష్టకరమన్నారు. ఇద్దరు వ్యక్తులు, రెండు సంస్థల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాధారణమే అన్నారు. గతంలో ఏపీతోను తాము ఇలాంటి చర్చలు జరిపామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మెట్రోను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరిస్తుందన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా రాయవద్దన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా సాగుతున్న ప్రాజెక్టు ఇదే అన్నారు. పత్రికలు ప్రకటించిన లేఖలు సాధారణంగా రాసేవే అన్నారు. లేఖలోని కొన్ని అంశాలను అనుకూలంగా మలుచుకొని మీడియా సంస్థలు వార్తలు రాశాయని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగా రాశారన్నారు.