'జగన్పై ఆర్బీఐ, ఇన్కం టాక్స్ కన్నేయాలి', ముద్రగడకు బోండా ప్రశ్నల వర్షం
అమరావతి: రూ.500, రూ.1000 నోట్లు రద్దయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో జగన్కు జ్వరం వచ్చిందని, అస్వస్థత కలిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు, ఆయన ఇంట్లో నేలమాలిగలో పెద్ద ఎత్తున ధనం ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
బుధవారం నాడు కూడా టిడిపి నేతలు వర్ల రామయ్య, బోండా ఉమలు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పెద్ద నోట్ల రద్దుతో జగన్ మంచాన పడ్డారని వర్ల అన్నారు. నోట్ల రద్దుతో జగన్ కోటలు ఒక్కసారిగా కూలిపోయాయన్నారు. ఐటీ, ఆర్బీఐ అధికారులు జగన్ పైన దృష్టి సారించాలన్నారు. పెద్ద నోట్ల రద్దు పైన నల్ల దొంగ నోరు తెరవడం లేదని ధ్వజమెత్తారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని అమరావతి పైన మొదటి నుంచి విషం కక్కుతోందని బోండా ఉమ నిప్పులు చెరిగారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసిపి ప్రయత్నిస్తోందన్నారు.
కాపు ఉద్యమం, ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ దీక్ష పైన కూడా స్పందించారు. ముద్రగడ అసలు పాదయాత్ర ఎందుకు తలపెట్టారో చెప్పాలన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతున్నందుకా, కాపు సంక్షేమం కోసం రూ.1000 కోట్లు ఇస్తున్నందుకా, చదువుల కోసం విదేశాలకు విద్యార్థులకు పంపిస్తున్నందుకా అని ప్రశ్నించారు.
వ్యక్తిగత కక్షతోనే ముద్రగడ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని, కాపులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ముద్రగడ మంజునాథ కమిషన్ను కలిసి ఎందుకు తన వాదన వినిపించలేదన్నారు.
ముద్రగడ పాదయాత్ర పైన సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్తున్నామన్నారు. గతంలో ఓసారి స్వేచ్ఛను ఇవ్వబట్టే తుని రైలు విధ్వంసం జరిగిందని చెప్పారు. అప్పుడు కాపు గర్జనకు ప్రభుత్వం సహకరించిందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications