జగన్పై ముప్పేట దాడి: బాబును మించి పవన్ కళ్యాణ్
హైదరాబాద్: సీమాంధ్రలో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముప్పేట దాడి జరుగుతోంది. జగన్ అవినీతి, పదవీకాంక్షలను ఎత్తి చూపుతూ ప్రత్యర్థులు ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కన్నా ఎక్కువగా జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ జగన్పై రెచ్చిపోతున్నారు. ఈ నెల 7వ తేదీన సీమాంధ్రలోని 25 లోకసభ స్థానాలకు, 175 శానససభా స్థానాలకు పోలింగ్ జరగనుంది.
పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ హఠావో, సీమాంధ్ర బచావో నినాదం ఇస్తున్నారు. జగన్ పదవీ కాంక్ష వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని ఆయన దుమ్మెత్తిపోశారు. వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్లపై వచ్చిన అవినీతి ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కె. చంద్రశేఖర రావుతో జగన్ను కలిపి ఆయన తిడుతున్నారు. కెసిఆర్, జగన్ అన్నదమ్ములని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ సీమాంధ్ర ప్రజలను తిడుతుంటే జగన్ ఎందుకు మాట్లాడరని, సీమాంధ్ర పౌరుషం చచ్చిపోయిందా అని ఆయన జగన్ను ప్రశ్నించారు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మొదటి నుంచీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యం చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అవినీతి సొమ్మును పెద్ద మొత్తంలో కూడబెట్టుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. సాక్షి మీడియా అవినీతి డబ్బుతో పుట్టిందని, అది తనపై తప్పుడు రాతలు రాస్తోందని ఆయన తాజాగా శుక్రవారంనాడు విరుచుకుపడ్డారు. తనకు విదేశాల్లో ఆస్తులున్నట్లు నిరూపిస్తే వాటిని రాసిస్తానని చంద్రబాబు సవాల్ చేశారు.
కాంగ్రెసును తల్లి కాంగ్రెసుగా, వైయస్సార్ కాంగ్రెసును పిల్ల కాంగ్రెసుగా అభివర్ణిస్తూ ఆయన చాలా కాలంగా దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్, కెసిఆర్ కుమ్మక్కయ్యారని కూడా ఆరోపిస్తున్నారు. కాంగ్రెసు జగన్, కెసిఆర్లతో కుట్ర చేసి రాష్ట్రాన్ని విభజించిందని ఆయన ఆరోపిస్తున్నారు.
ఇదిలావుంటే, కేంద్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత జైరాం రమేష్ చంద్రబాబు స్థాయిలో జగన్మోహన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. బెయిల్ కోసం తిరిగే వ్యక్తి, అవినీతిపనులతో డబ్బులు కూడబెట్టిన ముఖ్యమంత్రి పదవికి అర్హుడు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. గోల్కొండ లాంటి ధనాగారం జగన్ వద్ద ఉన్నట్లుందని ఆయన విరుచుకుపడ్డారు. అంతకు మించి తీవ్రంగా ఆయన జగన్పై మాట్లాడారు. వీటన్నింటినీ గ్రహిస్తూనే జగన్ తనదైన రీతిలో సీమాంధ్రలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. సీమాంధ్రలో చంద్రబాబుకు, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్యనే పోటీ ఉంటుందని అంచనాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications