వారిని మార్చుతారా?: జగన్ సీఎం కావాలి... కానీ వాళ్లు వద్దు, వైసీపీకి కొత్త చిక్కు!
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుర్కొన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు నియోజకవర్గాల్లో తెరాస ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నట్లుగా సర్వేలో తేలింది.

జగన్ ముఖ్యమంత్రి కావాలి
ఇప్పుడు వైసీపీ విషయంలోను అలాగే ఉందని చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న పలుచోట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే తెలంగాణలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ కేసీఆర్ పైన ఆయా నియోజకవర్గాల్లో ఆసక్తి కనబరిచారు. కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకున్నారు. వైసీపీ విషయంలోను అలాగే ఉందని, స్థానిక ఎమ్మెల్యేల విషయంలో అసంతృప్తి ఉన్నప్పటికీ, జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారట.

అందుకే ఎమ్మెల్యేలపై విముఖత!
గత రెండేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి వెళ్లడం లేదు. దీంతో సభలో తమ తమ నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించే అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు కొంతమంది నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదట. టీడీపికి వ్యతిరేకంగా తమ తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో పాల్గొనడం లేదట. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వారికి టఫ్ ఫైట్ ఉండనుందని చెబుతున్నారు. ఈ మేరకు స్వతంత్రంగా చేయించుకున్న సర్వేల్లో తేలిందట.

ఎమ్మెల్యేలు వద్దు.. జగన్ ఓకే
కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని, ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కూడా అంతగా ముందుకు సాగలేదని తేలిందని తెలుస్తోంది. దీంతో తమ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అదే సమయంలో జగన్ పట్ల సానుకూలంగా ఉన్నారని తేలిందట. వచ్చేసారి జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారట. మొత్తంగా జగన్కు పాజిటివ్ ఓట్, వైసీపీకి నెగిటివ్ ఓట్ ఉందని గుర్తించారని తెలుస్తోంది.

అభ్యర్థులను మారుస్తారా?
ఎమ్మెల్యేలపై పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి నేపథ్యంలో జగన్ ముందు ఒక ఆప్షన్ ఉందని, అది అభ్యర్థులను మార్చడం అని అంటున్నారు. లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకోకుండా జగన్ కోసం ప్రజలు ఓటు వేయాల్సి ఉంటుందని అంటున్నారు. కొందరు తమ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందని తెలిసి కూడా కేసీఆర్ పెద్దగా అభ్యర్థులను మార్చకుండా ఎన్నికలకు వెళ్లారు. తమ పథకాలు, కేసీఆర్ ఇమేజ్ గెలిపిస్తుందని తెరాస చెప్పుకొచ్చింది. అలాగే జరిగింది. మరి ఏపీలో జగన్ ఇమేజ్ ఆ ఎమ్మెల్యేలను కాపాడుతుందా చూడాలని అంటున్నారు.












Click it and Unblock the Notifications