తిరుమల లడ్డూ వివాదంపై వేగంగా పావులు కదిపిన జగన్
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాద వివాదం రాజకీయ రంగు పులుముకుంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హాయంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో పెద్ద ఎత్తున దుమారం చేలరేగింది.చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ సైతం ఘాటుగానే రియాక్ట్ అయింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే సీఎం ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఇదే సమయంలో ఈ వివాదంపై కోర్టు తలుపులు సైతం తట్టింది వైసీపీ. ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీ తో విచారణ చేయాలని కోరారు. సీబీఐతో విచారణ చేయించాలని..నిజం నిగ్గు తేల్చాలని పిటీషన్లో కోరింది వైసీపీ. పిటిషన్ పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇక ఈ వివాదంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సైతం స్పందించారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన జగన్, లడ్డూ ప్రసాద వివాదంపై క్లారిటీ ఇచ్చారు. 100 రోజుల పాలనపై చర్చ జరగకుండా ఉండేందుకే కల్తీ నెయ్యి వ్యవహారానికి తెరపైకి తీసుకొచ్చారని, అదంతా ఓ కట్టుకథ అని ఆయన కొట్టిపారేశారు. దేవుళ్ల వద్ద కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరుతో వందలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని జగన్ మండిపడ్డారు. తిరుమలకు వచ్చిన నెయ్యిని మూడుసార్లు టెస్ట్ చేస్తారు.
ఆ తర్వాతే లడ్డూ తయారీలో వినియోగిస్తారు. అబద్ధాలకు రెక్కలు కడుతున్నారంటూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. లడ్డూ ప్రక్రియ ఎప్పటి నుంచో నడుస్తుంది. మధ్యలో ఎవరో వచ్చి ఏదో చేసేది ఏమీ ఉండదు. మన వెంకటేశ్వరస్వామి, మన గుడిపై దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమలలో మేము విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాం. తిరుమల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని జగన్ చెప్పుకొచ్చారు. తిరుమల శ్రీవారి ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారు. ఏ తప్పూ జరగకపోయినా టీటీడీ పరువును బజారు కీడుస్తున్నారు. ఈ విషయంపై సీజేఐ, ప్రధాని మోదీకి లేఖ రాస్తామని జగన్ తెలిపారు.
తిరుమల లడ్డూ ప్రసాద వివాదంపై వైసీపీ రియాక్ట్ అయిన తీరును చూస్తుంటే, ఈ ఆరోపణల్లో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాలని వారు గట్టిగానే కోరుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఇంకా చెప్పాలంటే అధికార పార్టీకి ఎక్కడా కూడా తావు ఇవ్వకుండా సీబీఐ విచారణ కోరడం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వంటి అంశాలతో వైసీపీ సైతం దూకుడుగానే వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications