ఇక తేల్చుడే - అక్కడే: టైం చూసి రంగంలోకి పవన్ : జగన్ ఛాన్స్ ఇస్తారా..!!
విశాఖ పైనే ఇప్పుడు రాజకీయంగా ఫోకస్. ఈ నెల 15న విశాఖలో ఒక వైపు వికేంద్రీకరణకు మద్దతుగా గర్జన. అదే సమయంలో పవన్ యాత్ర. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. జనసేనాని వైసీపీ పైన ఇప్పటి వరకు విమర్శలకే పరిమితం అయ్యారు. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మూడు రాజధానుల వివాదంలో పవన్ కళ్యాణ్ అమరావతికి మద్దతుగా నిలిచారు. విశాఖ కేంద్రంగా సాగుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి..ఇప్పుడు విశాఖ కేంద్రంగా జరుగుతున్న రాజకీయంలో కీలకంగా మారుతున్నారు.

ఈ నెల 15న గర్జనకు ముహూర్తం
అమరావతి మహా పాదయాత్రను ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జేఏసీ ఏర్పాటైంది. ఈ నెల 15న భారీ ర్యాలీకి జేఏసీ పిలుపునిచ్చింది. ఇప్పుడ అదే రోజున పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్తున్నారు. పవన్ నిర్ణయాన్ని విశాఖ మంత్రులు తప్పు బడుతున్నారు. పవన్ ను రావద్దంటూ డిమాండ్ చేస్తున్నారు.
కానీ, ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో 2017 జనవరి 26న విశాఖ బీచ్రోడ్డులో వైసీపీ నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో వెళ్లిన వైఎస్ జగన్ను పోలీసులు అడ్డుకున్నారు. విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు పంపేసారు. అప్పట్లో అది రాజకీయంగా సంచలనంగా మారింది.

విశాఖ పర్యటనకు పవన్
ఆ తరువాత విశాఖ విమానాశ్రయంలోనే జగన్ పైన కత్తితో దాడి జరిగింది. ఇక, జగన్ సీఎం అయిన తరువాత 202, ఫిబ్రవరిలో విశాఖలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అది రాజకీయంగా విమర్శలకు కారణమైంది. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఈ నెల 15న జేఏసీ పిలుపునిచ్చిన గర్జన పైన పవన్ రెండు రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గర్జన రోజునే 15వ తేదీన విశాఖ పర్యటన ప్రకటించారు. అక్కడ ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. రోడ్ షోకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో విశాఖ కేంద్రంగానే భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ పవన్ నిర్వహించారు. ఇప్పుడు జేఏసీ నిర్వహిస్తున్న గర్జన నాడే పవన్ విశాఖ పర్యటన పైన మంత్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే, మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్దం అవుతున్నారు. దీంతో..అటు జగన్ ప్రభుత్వం ఏం చేయబోతున్నది ఉత్కంఠకు కారణమవుతోంది.

ఏం జరుగుతోందనే ఉత్కంఠ
అటు ర్యాలీ - ఇటు పవన్ పర్యటన విశాఖ నగరంలో ఒకే రోజున నిర్వహణ సాధ్యమా కాదా అనే చర్చ సాగుతోంది. పవన్ ను విశాఖ కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో పర్యటన ఏర్పాటు చేసుకుంటే అభ్యంతరం ఉండకపోవచ్చని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వమే లక్ష్యంగా రాజకీయ అడుగులు వేస్తున్న పవన్ తన నిర్ణయం మార్చుకుంటారా లేదా అనేది సందేహమే.
విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ లీడ్ తీసుకుంది. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహాలను అమలు చేస్తోది. ఈ సమయంలో పవన్ తన పర్యటన వాయిదా లేదా ప్రదేశం మార్పు చేసుకుంటారా అనేది చర్చకు కారణమవుతోంది. అదే విధంగా ఈ ర్యాలీ - పవన్ పర్యటన సమయంలో ఏరకమైన నిర్ణయాలు తీసుకుంటుందనేది మరింత ఉత్కంఠను పెంచుతోంది. దీంతో..ఇప్పుడు రాజకీయంగా ఈ నెల 15వ తేదీ విశాఖ కేంద్రంగా చోటు చేసుకొనే పరిణామాలు ఆసక్తిని పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications