ఏంచేయలేక జగన్ ఏడుస్తున్నారు, ముఖం కూడా: ఉమ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుణ మాఫీ పైన తన హామీలు నిలబెట్టుకున్నందున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏడుస్తున్నారని ఆ రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, పుల్లారావులు మంగళవారం అన్నారు. చంద్రబాబుతో పలువురు మంత్రులు భేటీ అయ్యారు. అనంతరం దేవినేని, పుల్లారావులు విలేకరులతో మాట్లాడారు.
రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయడం జగన్కు ఇష్టం లేదని ఆరోపించారు. ఇచ్చిన మాట బాబు నిలబెట్టుకున్నందుకు జగన్ ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. అహంకారంతో జగన్ ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్తులో ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితి కూడా వస్తుందన్నారు.
రుణమాఫీ పైన జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటమితో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఏడుస్తున్నారన్నారు. మంత్రులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తున్నారని చెప్పారు. జిల్లాలోని పరిస్థితులు, సమస్యల పైన వివరాలు తెలుసుకుంటున్నారన్నారు. అన్ని అంశాలను పరిశీలించి బాబు శాఖలను కేటాయిస్తారని చెప్పారు.
టి ఉద్యోగులు నష్టపోతారు: దేవీప్రసాద్
పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రలో కలపడం వల్ల తెలంగాణ ఉద్యోగులు నష్టపోతున్నారని టిఎన్జీవో నేత దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగుల విభజనపై ఇరు ప్రభుత్వాలు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. తప్పుడు లెక్కలతో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు.