చంద్రబాబు సభలకు భారీ జనం - గెలుపుకు ముందస్తు సంకేతమా : అక్కడే కొత్త ట్విస్ట్.!?
Jagan vs Chandrababu: ఏపీలోరాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు కొంత కాలంగా ఎక్కడకు వెళ్లినా జనం పోటెత్తుతున్నారు. ఎందుకీ సడన్ ఛేంజ్. జగన్ పైన ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందా. ఈ జన సందోహమే రానున్న ఎన్నికల ఫలితాలకు సంకేతంగా మారుతోందా. చంద్రబాబుకు వస్తున్న జన స్పందనను వైసీపీ సీరియస్ గా ఎందుకు తీసుకోవటం లేదు. జనంలో అంత స్పందన ఉంటే పొత్తుల దిశగా టీడీపీ ఆలోచనలు దేనికి. బీజేపీ నేతలకు ఈ జనం కనిపిస్తున్నారా. వారు చెబుతున్నదేంటి. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది.

నాడు జగన్ - నేడు చంద్రబాబు సేమ్ టు సేమ్
సేమ్ టు సేమ 2018-19 కాలంలో సీఎం జగన్ ఏ రకంగా వ్యవహరించారో ఇప్పుడు చంద్రబాబు అదే బాటలో అడుగులు వేస్తున్నారు. నాడు జగన్ కోసం పని చేసిన ప్రశాంత్ కిషోర్ టీంలోని సభ్యులే ఇప్పుడు అటు జగన్..ఇటు చంద్రబాబుకు రాజకీయ వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నాడు జగన్ పాదయాత్ర వేళ అమలు చేసిన వ్యూహాలనే ఇప్పుడు చంద్రబాబుతోనూ అమలు చేయిస్తున్నారు. నాడు పాదయాత్ర సమయంలో జగన్ సభలకు జనం పోటెత్తారు. ఏ ప్రాంతంలో సభ పెట్టినా జన సందోహమే. ఇప్పుడు చంద్రబాబు పర్యటనల్లోనూ అదే జరుగుతోంది. ఎక్కడకు వెళ్లినా జనమే. చంద్రబాబుకు అంతా అనుకూలంగా ఉన్న రోజుల్లోనూ ఈ తరహా జనం కనిపించ లేదు. సరిగ్గా ఇక్కడే వ్యూహకర్తలు తమ పని పూర్తి చేస్తున్నారు. సాధారణ ప్రజల్లో ఈ సభలకు వస్తున్న జన స్పందనతో చంద్రబాబు పైన పాజిటివ్ అభిప్రాయం కలిగేలా చేయటం వ్యూహకర్తల తొలి లక్ష్యం. చంద్రబాబు కు ఇవే చివరి ఎన్నికలని వైసీపీ ప్రచారానికి ఇది కౌంటర్.

2019 ఎన్నికల వ్యూహాలే రిపీట్..
2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర వేళ..సామాజిక సమీకరణాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగానే నాడు జగన్ సోషల్ ఇంజనీరింగ్ పక్కాగా అమలు చేయగలిగారు. సేమ్ ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ అదే జరుగుతోంది. రోడ్ షోల తరువాత ఆ ప్రాంతాల్లో బలమైన వర్గాలుగా ఉన్నవారిని గుర్తించి వారితో ఆత్మీయంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా విజయనగరంలో అదే విధంగా బీసీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఉత్తరాంధ్రలో బీసీ ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో అక్కడ ఈ తరహాల భేటీ ఏర్పాటు చేసారు. చంద్రబాబు పర్యటనకు ఎంపిక చేసుకుంటున్న ప్రాంతాల్లోనూ పక్కా వ్యూహం ఉంది. నాడు కర్నూలు, నేడు విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. ఈ రెండు జిల్లాలు గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన ప్రాంతాలు. నాడు జగన్ తన ప్రసంగాల్లో చంద్రబాబు విశ్వసనీయత పైన దెబ్బ కొట్టే ప్రసంగాలు చేసారు. ఇప్పుడు చంద్రబాబు రివర్స్ లో జగన్ పాలన పైన అస్త్రాలు ఎక్కు పెట్టారు.

వ్యూహాలు ఓకే..ఫలితం ఏమయ్యేను
జగన్ ను ఈ ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బ తీయాలనేది చంద్రబాబు లక్ష్యం. సభలకు వస్తున్న భారీ జన స్పందనతో పార్టీలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మొదలైంది. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా.. జగన్ ను కొత్త వ్యూహాల తో దెబ్బ తీయటానికి చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకున్నారు. వారు తెర వెనుక ఉండి కొత్తగా సభల నిర్వహణ మొదలు..ప్రచారం వరకు కీలకం గా మారారు. చంద్రబాబు ఇప్పుడు నిర్వహిస్తున్న సభల తరహాలోనే లోకేశ్ పాదయాత్రలోనూ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. సీఎం జగన్..ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇప్పుడు వెనుక వ్యూహాలు అందించి..ముందుకు నడిస్తున్న వ్యూహకర్తలు ఇద్దరూ గతంలో ప్రశాంత్ కిషోర్ తో కలిసి జగన్ కోసం పని చేసిన వారే. దీంతో, టీడీపీ వారి పూర్వ అనుభవాన్ని తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. విజయం పైన ఇప్పటికే సీఎం జగన్ - చంద్రబాబు ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ రోల్ పైన స్పష్టత రావాల్సి ఉంది. దీంతో..ఈ జన స్పందన చంద్రబాబుకు ఓట్లుగా మారి అధికారం తెచ్చి పెడుతుందా.. లేక, జగన్ నమ్ముకున్న సంక్షేమమే మరోసారి అధికారం అందిస్తుండా అనేదే ఇప్పుడు చర్చ.












Click it and Unblock the Notifications