ఆంక్షలు గొంతు నొక్కడమే: కెసిఆర్పై జైపాల్ రెడ్డి
మెదక్: పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు లేదని కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అన్నారు. ఆంక్షలు విధించడమంటే మీడియా గొంతు నొక్కడమే అని ఆయన గురువారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
తెలంగాణలో ఏబీఎన్, టీవీ9 ప్రసారాలను నిలిపివేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ సీఎం అండతోనే ఎంఎస్వోలు రెండు చానెళ్ల ప్రసారాలు నిలిపివేశారని ఆయన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికైనా గవర్నర్ చొరవ తీసుకుని చానెళ్ల ప్రసారాలను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని డీఎస్ కోరారు.
మీడియా స్వేచ్ఛను హరిస్తూ కెసిర్ హిట్లర్ను మించిపోయారని మాజీ మంత్రి, మెదక్ కాంగ్రెసు అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. దళితుడు, డిప్యూటీ సీఎం రాజయ్యను కెసిఆర్ అవమానించారన్నారు. కేసీఆర్కు మహిళలపై గౌరవం లేదని విమర్శించారు. చెల్లని రూపాయి అంటూ తనను అవమానిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
కలెక్టరేట్ వద్ద ధర్నా
తెలంగాణలో ఛానళ్లపై నిషేధానికి నిరసనగా హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఏబీఎన్ జర్నలిస్టులు గురువారం ధర్నా చేపట్టారు. జర్నలిస్టులకు టీయూడబ్ల్యూ మద్దతు తెలిపింది. తెలంగాణలో ఛానళ్లపై నిషేధం ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.