ఏం చేస్తారు: సీమాంధ్ర నేతలకు జైపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్న కేంద్రమంత్రులపై, సీమాంధ్ర ప్రాంత నాయకుల పైన తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి బుధవారం తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాకుండా మీరంతా ఇప్పుడు అడ్డుకుంటున్నారని, ఆ తర్వాత ఏమి చేస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ను మీరు పాలించగల్గుతారా, అక్కడి సీమాంధ్రులకు రక్షణ కల్పించగల్గుతారా అన్నారు.
ప్రజల మధ్య వైషమ్యాలు రగలితే ఏం చేస్తారన్నారు. శాంతిభద్రతలు మన చేతుల్లో ఉండవని అన్నారు. సమైక్యాంధ్ర కావాలని కోరుకోవడం సరికాదన్నారు. సమైక్యాంధ్రలో వారిదే ప్రభుత్వమన్నారు.
సమైక్యాంధ్రలో తమను ఎలా పాలిస్తారనేదే ప్రశ్నే అన్నారు. ఇంతగా విద్వేషాలు వచ్చాక కలిసి ఉండాలనటం సరికాదన్నారు. పార్లమెంటులో జరుగుతున్న పరిణామాల పట్ల జైపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించాలని హితవు పలికారు.
రాష్ట్రం విడిపోకుంటే తాను హైదరాబాదులో అడుగు పెట్టలేనని, ఢిల్లీలోనే చిన్న ప్లాట్ అద్దెకు తీసుకొని ఉంటానని, తనకు పెద్దగా ఆస్తులు కూడా లేవని జైపాల్ రెడ్డి అన్నారు. తనను సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కలిసినప్పుడు ఆయన తీవ్రంగా స్పందించారు.