తొందరపాటు: ఆర్డినెన్స్పై జానా, సరి కాదు: అసద్
హైదరాబాద్: పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ జారీ చేసిన అర్డినెన్స్పై పార్టీలకు అతీతంగా తెలంగాణ నాయకులు తప్పు పడుతున్నారు. పోలవరంపై కేంద్ర ఆర్డినెన్స్ తొందరపాటు చర్య అని కాంగ్రెసు తెలంగాణ నాయకుడు, శాసనసభ్యుడు కుందూరు జానారెడ్డి అన్నారు. ఆర్డినెన్స్తో కేంద్రం ఓ వైపు ముగ్గు చూపిందనే భావన కలుగుతోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రెండు ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
పోలవరం ఆర్డినెన్స్ జారీని మజ్లీస్ అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా తప్పు పట్టారు. పోలవరంపై ఆర్డినెన్స్ జారీ తొందరపాటు చర్య అని ఆయన అన్నారు. గురువారం ఆయన గవర్నర్ నర్సింహన్ను కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీ చేయడం సరి కాదని ఆయన అన్నారు. హైదరాబాద్లో కిషన్బాగ్ అల్లర్లపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెసు నేత మల్లుభట్టి విక్రమార్క తప్పు పట్టారు. ఈ ఈర్డినెన్స్ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని ఆయన అన్నారు. ఈ ఆర్డినెన్స్ జారీ వెనక కుట్ర దాగి ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఇలా చేస్తూ పోతే ఇందిరాసాగర్ నీటిపారుదల ప్రాజెక్టును కూడా ఆంధ్రప్రదేశ్కు తరలించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఈ ఆర్డినెన్స్ రావడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా కారణమని ఆయన అన్నారు. 1956కు ముందున్న తెలంగాణ కావాలని అనడం వల్లనే ఇది జరిగిందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. యుపిఎ నిర్ణయాన్ని ఎన్డియె అమలు చేసిందనడం సరి కాదని, విభజన బిల్లులో ఆనాడు ఏడు మండలాలు లేవని ఆయన అన్నారు.