పవన్ కల్యాణ్ కన్నీరు పెట్టుకున్న వేళ! కార్యకర్త చిత్రపటానికి నివాళి
ఏలూరు: ప్రాణాంతక కేన్సర్ తో బాధపడుతూ, కొద్దిరోజుల కిందట మరణించిన జనసేన పార్టీ కార్యకర్త కొప్పినీడి మురళీకృష్ణ కుటుంబాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్పించారు. ఆయన భార్య, తల్లి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. తాను ఉన్నానని ధైర్యాన్ని ఇచ్చారు. అన్ని విధాలుగా పార్టీ ఆదుకుంటుందని భరోసా కల్పించారు. మురళీకృష్ణ కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన రెండురోజుల పర్యటన సోమవారం నాటితో ముగియనుంది. ఇప్పటికే భీమవరం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఇక నరసాపురం లోక్ సభ నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులతో సమావేశం కానున్నారు. ఈ పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి.. జిల్లాలోని తాడేరులోని మురళీకృష్ణ ఇంటికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం మురళీకృష్ణ ఎలా మృతి చెందారనే విషయంపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మురళీకృష్ణ తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన భార్య ఊహా జ్యోతికి దైర్యం చెప్పారు. జనసేన గెలుపు కోసం మురళీకృష్ణ చేసిన కృషిని స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ తల్లి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ గెలిచిన నాడే తన కుమారుడి ఆత్మశాంతిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాటలతో పవన్ కల్యాణ్ సైతం కన్నీరు పెట్టుకున్నారు.
పార్టీ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారని, క్రియాశీలక కార్యకర్తను కోల్పోవడం తనను కలచి వేస్తోందని చెప్పారు. మురళీకృష్ణ లేనప్పటికీ.. తాను కుమారుడి స్థానంలో ఉంటానని, అన్ని విధాలుగా పార్టీని ఆదుకుంటానని పవన్ కల్యాణ్ వారికి హామీ ఇచ్చారు. పిల్లల చదువులను పార్టీ చూసుకుంటుందని అన్నారు. తన వ్యక్తిగత ట్రస్ట్ నుంచి రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు. ఈ మొత్తంతో కూడిన చెక్ ను మురళీకృష్ణ భార్యకు అందజేశారు.
అనంతరం పవన్ కల్యాణ్ స్థానిక విలేకరులతో మాట్లాడారు. పార్టీ గెలుపు కోసం మురళీకృష్ణ పనిచేశారని, ఈ క్రమంలో ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోలేదని అన్నారు. నిబద్దంగా పార్టీ కోసం పని చేసే కార్యకర్తలు చనిపోవడం బాధ కలిగిస్తోందని అన్నారు. మురళీకృష్ణ మరణించిన విషయం నాగబాబు తన దృష్టికి తీసుకువచ్చారని, ఆయన కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మురళీకృష్ణ ఆశయాన్ని సాధించేలా పనిచేస్తామని చెప్పారు. డబ్బుతో ప్రాణాలకు వెలకట్టలేనప్పటికీ.. ఆయన కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయాన్ని చేశామని అన్నారు.