జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...మార్చి 14న భారీ ర్యాలీ
విజయవాడ:మంగళగిరి మండలం కాజ సమీపంలో ఈ నెల 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకోసమే ఆ రోజు నిర్వహించే భారీ బహిరంగ సభ ప్రారంభం కావడానికి ముందు భారీ ర్యాలీని నిర్వహించాలని ప్లాన్ చేశారు.
జనసేన ఫార్మేషన్ డే వేడుకలు ఎంతో ప్రత్యేకంగా సాగాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఒక కాన్సెప్ట్ ప్రకారం ఈ కార్యక్రమాలు ఆసాంతం కొనసాగేలాగా నిర్వాహకులు శ్రద్ద వహిస్తున్నారు.
ఆవిర్భావ దినోత్సవం సభ జరగడానికి ముందుగా త్రివర్ణశోభిత దుస్తులతో 970 మంది యువకులు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి కాజ వద్ద జరిగే సభా ప్రాంగణం వరకు 14 కిలోమీటర్ల దూరం వరకు ఫ్లాగ్ మార్చ్ చేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 970 కిలోమీటర్ల కోస్తా తీరం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, 970 మంది చేత పరేడ్ నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా సభకు వచ్చిన వారిని కూడా స్వాగతించి, తిరిగి వీడ్కోలు పలికేందుకు భగత్సింగ్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో 400 మందికి బేసిక్ లైఫ్ సపోర్టు శిక్షణ కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు.