నాకు ప్రాణహాని ఉంది.. సుపారీ గ్యాంగులను దించారు: పవన్ కల్యాణ్
తనకు ప్రాణహాని ఉందని, సుపారీ గ్యాంగులను దించారనే సమాచారం తనదగ్గర ఉందని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన నాయకులతోపాటు కార్యకర్తలు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా పవన్ పై విధంగా కామెంట్స్ చేశారు.
జనసేన పార్టీ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలకులను గద్దె దించే దిశగా పయనిస్తోందన్నారు. ఇటువంటి సమయంలో వారు ఏం చేయడానికైనా సిద్ధపడతారని, అధికారం తమకు దక్కదు.. పోతోందన్న భావన నాయకులను క్రూరంగా మార్చేస్తుందన్నారు. వారు ఎంతకైనా తెగిస్తారన్నారు. తనను ఎంత భయపెడితే అంత రాటుదేలతానని హెచ్చరించారు.

కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికులు, వీరమహిళల మీద గతంలో చేసిన దాడిని మర్చిపోనన్నారు. ఓ బలమైన కార్యాచరణ లేక అప్పట్లో వెనుకడుగు వేశామని.. అన్నింటికీ సరైన రీతిలో సమాధానం చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకూడదన్నారు. తాను సినీ నటుడిని కాకపోతే బలమైన రాజకీయ నేతగా జనంలోకి చొచ్చుకెళ్లేవాడినని, కానీ తనను అభిమానుల తాకిడి అడ్డుకుంటోందన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలను పవన్ కల్యాణ్ ప్రదర్శిస్తున్నారు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతోపాటు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మెజారిటీ నియోజకవర్గాలను ఈ రెండు జిల్లాల నుంచే సాధించాలని పవన్ భావిస్తున్నారు. అందుకనుగుణంగా పార్టీ నాయకులతో తరుచుగా సమావేశమవుతూ జనసేన పరిస్థితిని సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications