టీడీపీతో పొత్తు - కాపు రిజర్వేష్ల పై పవన్ కీలక ప్రకటన..!?
ఎన్నికలకు సమాయత్తం అవుతున్న పవన్ కల్యాణ్ కీలక ప్రకటనకు సిద్దమయ్యారు.
జనసేనాని ఎన్నికల యుద్దానికి సిద్దం అవుతున్నారు. పార్టీ ఆవిర్భావ సభ వేళ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు పైన పరోక్ష సంకేతాలే కానీ..పవన్ నేరుగా స్పష్టత ఇవ్వలేదు. ఇదే సమయంలో టీడీపీ-బీజేపీతో సంబంధాల పైన ఇక తేల్చేయాలని పవన్ భావిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల వ్యవహారం పైన పవన్ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీని పైన నిర్ణయం దిశగా పవన్ కసరత్తు ప్రారంభించారు. ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కీలక నిర్ణయాలు..ప్రకటన దిశగా పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇందుకు ముహూర్తం..వేదిక ఖరారు చేసారు.

హరి రామ జోగయ్య తో పవన్ కల్యాణ్ కీలక సమావేశం
జనసేనాని పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు ఏర్పాటు చేసారు. ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో నిర్వహించనున్నారు. ఇందుకు ముందే పవన్ కీలక అంశాల పైన పార్టీ నేతలతో చర్చలు చేయాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ సభను ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం సభ నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన పవన్ విజయవాడ చేరుకోనున్నారు. ఏపీలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కాపు రిజరేషన్ల అంశం పైన ముఖ్యులతో చర్చించనున్నారు. 12వ తేదీన మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తో సహా అన్ని జిల్లాల కాపు నేతలతో పవన్ సమావేశం కానున్నారు. వారి నుంచి కాపు రిజర్వేషన్ల అంశం పైన అభిప్రాయాలు సేకరించి..పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలనే అంశం పైన నిర్ణయం తీసుకోనున్నారు. కాపు రిజర్వేషన్ల అమలు పై కొంత కాలంగా డిమాండ్ పెరుగుతోంది.

పొత్తులు - పార్టీ కార్యాచరణపైనా చర్చలు
13వ తేదీ పార్టీ ముఖ్య నేతలతో పవన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే క్రమంలో అమలు చేసిన వ్యూహాలు..నియోజవకర్గ సమీక్షలు..వారాహి తో రాష్ట్ర వ్యాప్త పర్యటన గురించి ఈ భేటీలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీలో చేరికల పైనా పవన్ తన నిర్ణయం ప్రకటించనున్నారు. బీజేపీతో ప్రస్తుతం పొత్తు కొనసాగుతున్న వేళ పవన్ తన మనసులో మాట పార్టీ నేతలతో పంచుకొనే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు ఖాయమని జనసేన నేతలు కూడా భావిస్తున్నారు. ఈ అంశం పైన పార్టీ నేతల నుంచి పవన్ అభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉంది. బీజేపీ - టీడీపీ తో జనసేన భవిష్యత్ బంధం గురించి పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ పొత్తు నిర్ణయాధికారం అధ్యక్షుడికి అప్పగిస్తూ తీర్మానం చేయనున్నట్లు సమాచారం.

ఆవిర్భావ సభ వేదికగా కీలక ప్రకటన
జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా కీలక ప్రకటనకు పవన్ సిద్దం అవుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఇప్పటి వరకు మంగళగరిలోనే నిర్వహించింది. తొలి సారి వ్యూహాత్మకంగా మచిలీపట్నంలో నిర్వహణకు నిర్ణయించింది. ఆవిర్భావ సభా వేదిక నుంచే పవన్ కల్యాన్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్దం అవుతున్నారు. ఆ సభా వేదిక నుంచే బీజేపీ - టీడీపీతో తమ భవిష్యత్ సంబంధాల పైన క్లారిటీ ఇస్తారని సమాచారం. టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. వైసీపీ సవాళ్ల నడుమ ఇక పొత్తుల అంశం పైన ఎక్కవ కాలం సాగదీయటం మంచిది కాదని పవన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొత్తుల వ్యవహారంతో పాటుగా.. కాపు రిజర్వేషన్ల పైన జనసేన వైఖరి..కార్యాచరణ పవన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఈ సారి జనసేన ఆవిర్భావ సభపై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications