నేడు పల్నాడుకు పవన్ కల్యాణ్ - మంత్రి అంబటి లక్ష్యంగా..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గం సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొంటారు. వైసీపీ వర్సస్ పవన్ మధ్య పొలిటికల్ వార్ నడుమ..మంత్రి అంబటి వర్సస్ జనసేన మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది.
అదే సమయంలో పల్నాడు జిల్లా మాచర్లలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ పర్యటన ఆసక్తిగా మారుతోంది. ఇదే సమయంలో జనసేన ముఖ్య నేత మనోహర్ ప్రభుత్వానికి సవాల్ చేసారు. పోలీసులు పవన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడం మంచి పద్దతి కాదన్నారు.

అంబటి ఇలాకాలో పవన్ కల్యాణ్
మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంబటి నియోజకవర్గంలో పవన్ పర్యటన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. పవన్ కల్యాణ్ పైన మీడియా సమావేశాలు - ట్వీట్ల తో ద్వారా అంబటి విరుచుకుపడుతూ ఉంటారు. అదే విధంగా జనసేన నుంచి అంబటి లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు కొనసాగుతున్నాయి.
ఈ సమయంలో జనసేన అధినేత పవన్ మంత్రి నియోజకవర్గంలో పర్యటనతో కొత్త చర్చ మొదలైంది. ఈ నియోజకవర్గ పర్యటనలో పవన్ కల్యాణ్ రాజకీయంగా కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అంబటికి రాజకీయం గా చెక్ పెట్టే విధంగా సత్తెనపల్లి నియోజకవర్గం కేంద్రంగా ఈ నిర్ణయాలు ఉంటాయని సమాచారం. అటు మాచర్లలో చోటు చేసుకున్న పరిణామాలతో పోలీసు యంత్రంగా అప్రమత్తమైంది.

బెదిరిస్తున్నారు..మనోహర్ సవాల్
తాజాగా పల్నాడులో చోటు చేసుకున్న రాజకీయ దాడులు..తాజా పరిణామాలతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడులో ఉద్రిక్తల పేరు చెప్పి జనసేన నేతలను సత్తెనపల్లికి రానీయకుండా అడ్డుకుంటున్నారని మనోహర్ ఆరోపించారు. వాహనాల్లో ఎక్కువ సంఖ్యలో రావటం పైన పరిమితులు విధించటాన్ని ఆయన తప్పు బట్టారు.
పవన్ పర్యటనకు అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు పెద్ద సంఖ్యలో పల్నాడులోనే ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. దీని కారణంగానే పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో కౌటు రైతు భరోసా యాత్రను నిర్వహిస్తున్నామని మనోహర్ వివరించారు. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్దిక సాయం చెక్కుల రూపంలో అందిస్తారని మనోహర్ స్పష్టం చేసారు.

పవన్ పర్యటనపై ఉత్కంఠ
జనసేన అధినేత పవన్ పల్నాడు పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. కౌలు రైతులకు మద్దతుగా ఇప్పటికే పలు జిల్లాల్లో పవన్ భరోసా యాత్రలు నిర్వహించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించే మనసు ఈ ప్రభుత్వానికి లేదని విమర్శలు గుప్పిస్తోంది. పరిపతి ఉన్న రైతు కుటుంబాలకే ప్రభుత్వ పరిహారం అందిందని జనసేన నేత మనోహర్ ఆరోపించారు.
ఇక...మాచర్ల ఘటనలపైన పవన్ స్పందించే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా పొత్తుల పై పవన్ ఏమైనా తేల్చి చెబుతారా.. సంకేతాలు ఇస్తారా అనేది మరో చర్చ. అమరావతి పరిధిలో..పల్నాడు ప్రాంతంలో పవన్ పర్యటన - సభ ఉండటంతో ఇప్పుడు రాజకీయంగానూ ఉత్కంఠ కనిపిస్తోంది. మంత్రి అంబటి లక్ష్యంగా పవన్ ఎటువంటి కామెంట్స్ చేయబోతున్నారనేది జనసైనికులు వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications