ఏం జరిగిందో ఏమో గానీ.. డీలిమిటేషన్ భేటీకి ఎంపీని పంపిన పవన్- అక్కడే ట్విస్ట్
Pawan Kalyan: లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేపట్టిన ఉద్యమానికి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వాలని భావించారా? అందుకే- ఈ భేటీకి పార్టీ తరఫున ఎంపీని సైతం పంపించారా?.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.
కొత్త ఉద్యమానికి..
2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తోన్నాయి.

స్టాలిన్ సారథ్యంలో..
దీనికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాయి. దీనికి నాయకత్వాన్ని వహిస్తోన్నారు స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ముందురోజు రాత్రే చెన్నైకి..
ఈ భేటీలో పాల్గొనడానికి జనసేనకు చెందిన కాకినాడ లోక్సభ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ శుక్రవారం రాత్రే చెన్నైకి చేరుకున్నారు. డీఎంకే ప్రతినిధులు ఆయనకు స్వాగతం సైతం పలికారు. ఆ సమావేశం ఆరంభం కావడానికి ముందే- అంటే శనివారం ఉదయానికే వెనక్కి వెళ్లిపోయారు.
బొకే ఇచ్చి స్వాగతం..
దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ది ఇండియన్స్ ఎక్స్ప్రెస్ ఎక్స్క్లూజివ్గా ప్రచురించింది. ఉదయ్ శ్రీనివాస్కు డీఎంకే ప్రతినిధులు బొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్న ఫొటోను దీనికి యాడ్ చేసింది. ఈ కథనం.. ఇప్పుడు అటు తమిళనాడు, ఇటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది.
ఐటీసీ గ్రాండ్ చోళలో బస..
ఢిల్లీ నుంచి శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో ఉదయ్ శ్రీనివాస్ చెన్నై విమానాశ్రయానికి చేరుకోగా.. డీఎంకే ఎంపీలు పీ విల్సన్, ఎంఎం అబ్దుల్లా బొకే ఇచ్చి స్వాగతం పలికారు. బస ఏర్పాటు చేసిన ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్కు ఆయనను తీసుకెళ్లారు. జనసేన ప్రతినిధిగా ఉదయ్ శ్రీనివాస్.. హాజరు కాబోతోండటంతో ఆయన కోసం డీలిమిటేషన్ సమావేశంలో సీటును సైతం రిజర్వ్ చేశారు.

జనసేన వివరణ..
ఉదయ్ శ్రీనివాస్ డీలిమిటేషన్ సమావేశానికి చెన్నైకి వెళ్లడంపై జనసేన వివరణ ఇచ్చినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తన కథనంలో పేర్కొంది. తమ పార్టీ ప్రతినిధులెవరూ హాజరు కావట్లేదని తెలియజేయడానికే ఉదయ్ శ్రీనివాస్ చెన్నైకి వెళ్లారంటూ ఉటంకించింది.
బీజేపీ అధిష్ఠానం కంట్లో..
వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉందని, డీలిమిటేషన్ సమావేశం ఏర్పాటైన వేళ- ఉదయ్ శ్రీనివాస్ చెన్నైలో ఉండటం బీజేపీ అధిష్ఠానం కంట్లో పడిందని, అందుకే ఆయనను వెంటనే వెనక్కి పిలిపించుకోవాల్సిందిగా జనసేన పార్టీ అగ్ర నాయకత్వానికి హుకూం జారీ చేసిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది.
హుటాహుటిన ఫోన్..
బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఉదయ్ శ్రీనివాస్కు ఫోన్ చేశారని, వెంటనే వెనక్కి రావాలంటూ ఆదేశించారని వివరించింది. అదే సమయంలో ఆయన స్వయంగా స్టాలిన్తో ఫోన్లో మాట్లాడారని, హఠాత్తుగా వెనక్కి రావడానికి గల కారణాలను తాను తరువాత వివరిస్తానని చెప్పినట్లు డీఎంకే వర్గాలు వెల్లడించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది.
ఎన్డీఏకు వ్యతిరేకంగా..
భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ, ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతోంది జనసేన. ఈ పరిస్థితుల్లో బీజేపీ/ ఎన్డీఏకు వ్యతిరేకంగా డీఎంకే చేపట్టిన ఉద్యమానికి జనసేన ఎంపీ హాజరు కావడానికి చెన్నైకి చేరుకోవడం, స్వాగతాన్ని అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏదో మర్మం ఉండే ఉంటుంది..
ఈ వ్యవహారం మొత్తం మీద డీఎంకే అధికారికంగా స్పందించలేదు గానీ.. ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు మాత్రం మాట్లాడారు. జనసేన ఎంపీ చెన్నైకి వచ్చారంటే అందులో ఏదో మర్మం ఉండే ఉంటుందని చెప్పారు. డీఎంకే నుంచి తమకు ఆహ్వానం అందిందంటూ జనసేన పార్టీ కూడా అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. కూటములు వేరు కావడం వల్ల తాము దూరంగా ఉన్నామని పేర్కొంది.












Click it and Unblock the Notifications