కేసీఆర్ కుయుక్తి, ఏపీని దెబ్బతీయడంలో టీడీపీ: జేసీ షాకింగ్, కాంగ్రెస్తో పొత్తు ఓకే కానీ..
హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో విభజన అంశంలో సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేశారు.
ఏపీలో కాంగ్రెస్తో పొత్తు మంచిది కాదు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మద్దతు కోరుతోందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అక్కడ (తెలంగాణ) కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ఇస్తే తప్పు లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో మాత్రం పొత్తు ఏమాత్రం మంచిది కాదన్నారు. తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉందని చెప్పారు. తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదని చెప్పారు. కాంగ్రెస్ - టీడీపీ పొత్తు తెలంగాణ వరకే పరిమితం అన్నారు. ఏపీలో ఆ అవసరం లేదని చెప్పారు.
ఏపీని దెబ్బతీయడంలో అందరి పాత్ర
నవ్యాంధ్రను దెబ్బతీయడంలో అందరి పాత్ర ఉందని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన పాపం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలదే అన్నారు. ఏపీకి ఏదో చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని నాలుగేళ్లు నమ్మి మోసపోయామని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, కాబట్టి ఆ పార్టీని నమ్మి చూస్తే మాత్రం తప్పులేదన్నారు.
కేసీఆర్ ముందస్తు రాజకీయ కుయుక్తి
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుయుక్తి అని జేసీ విమర్శించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ముస్లీంలు దూరమవుతారనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ తెలంగాణలో ముందస్తుకు వెళ్తున్నారని చెప్పారు.
ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు
ముస్లీంలో ఎక్కడ దూరమవుతారోననే ఆందోళనతోనే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పారు. పొత్తుల విషయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నాటి పరిస్థితిలు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అని చెప్పారు.