సిఎంతో వెళ్లి దండమే, పోరాటమా వంకాయా: జెసి
ఏలూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోమారు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటులో మీరేదైనా పోరాటం చేయ దలిచారా అని మీడియా ప్రతినిధులు స్పందిస్తూ - ‘పోరాటమా.. వంకాయా..' అంటూ జెసి దివాకర్ రెడ్డి సమాధానమిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎంపీ మాగంటి బాబు ఇంటిలో ఆదివారం జరిగిన శుభ కార్యక్రమానికి హాజరైన దివాకర్ రెడ్డి కాసేపు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రాననికి ప్రత్యేక హోదా విషయమై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జేసీ స్పందిస్తూ.. ‘ఏంది పోరాటం చేసేది. 500 సీట్లలో 375 సీట్లు అనుకుంట బీజేపీ మెజార్టీ. పోరాటం లేదూ.. వంకాయా లేదు. సీఎంతో వెళ్లి నాలుగు నమస్కారాలు పెట్టి రాష్ట్రంపై దయదలచమనడమే కానీ, ఎందుకు చేయరని అడిగే శక్తి లేదు. షర్ట్ పట్టుకుని అడగలేం. పోతున్నాం.. వస్తున్నాం' అని నిర్వేదంగా మాట్లాడారు.
రాష్ట్ర విభజన పద్ధతి ప్రకారం జరగలేదని ఆయన అన్నారు. పక్షపాతంతో రాష్ట్ర విభజన జరిగిందంటే అది సోనియాగాంధీ ఘాతుకమేనని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెసును విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టాలంటే పదేళ్లో, ఐదేళ్లో పడుతుందని అందరూ అనుకుంటున్నారని, కానేకాదు 50 సంవత్సరాలు పడుతుందని జేసీ స్పష్టం చేశారు. కురుక్షేత్రంలో దుర్మార్గులందరూ కలిసి అభిమన్యుడిని చంపినట్టే రాష్ట్ర విభజన జరిగిందని జేసీ అన్నారు.
అధికారంలో లేనప్పుడు రాజకీయ నాయకులకు ఒక మనస్తత్వం ఉంటుందని, వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంటుందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందని జెసి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇచ్చి అభివృద్ధి చేస్తామన్నాయని, అది వచ్చిందీ లేదు.. పోయిందీ లేదని అన్నారు. ఇప్పుడు మిగిలింది ఇంత బూడిద తప్ప ఏమీ లేదని అన్నారు. తాను ఆశాజీవినని, పరిస్థితులు మాత్రం ఆశాజనకంగా లేవని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు.