బాబుపై ప్రశంస: లోకసభలో గళమెత్తిన జేసీ దివాకర్
న్యూఢిల్లీ: లోక్సభలో శుక్రవారం తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి రైతుల సమస్యలపై గళమెత్తారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి రైతులను ఆదుకోవాలని లోక్సభలో జేసీ దివాకర్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం బడ్జెట్లో ఎంతోకొంత నిధులు కేటాయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదుల అనుంధానం గురించి జేసీ దివాకర్ రెడ్డి వివరించారు. ఇక్కడ నదుల అనుసంధానంతో ప్రజలకు నీటిని అందిస్తున్నామని జేసీ చెప్పారు.
ఏపీలో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో నదుల అనుసంధానాన్ని విజయవంతంగా పూర్తిచేశామని, దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జేసీ సూచించారు. ఉపాధి హామీ వేతనాన్ని కూడా పెంచాలని కోరిన జేసీ అవసరమైతే 50 శాతం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

చంద్రబాబు నేతృత్వంలో..
జేసీ విజ్ఞప్తులను పరిశీలిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఉపాధి హామీ వేతనపెంపు ప్రతిపాదనను గ్రామాభివృద్ధి శాఖకు పంపుతామన్నారు. పేద రైతులు పండించే పంటలకు సరైన ధరలు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవచూపాలని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ లోక్సభలో కోరారు.

జైట్లీ స్పందన
పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పెట్టుబడి విషయంలో రైతులకు చేదోడు వాదోడుగా నిలవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని కొనకళ్ల అన్నారు. కొనకళ్ల విజ్ఞప్తితో స్పందించిన ఆర్థిక మంత్రి జైట్లీ.. కనీస మద్ధతు ధరతో పాటు రాయతీ ధరలకు ఎరువులు అందిస్తున్నట్లు చెప్పారు.

ప్రధానితో ఎంపీల భేటీ..
ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎంపీలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. విభజన చట్టం హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, ఇతర పెండింగ్ అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించారు. కష్టాల్లో ఉన్న నవ్యాంధ్రను ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు.
Recommended Video


ఫిర్యాదుల పెండింగ్లో ఉండొద్దు..
సమస్యల పరిష్కారం దిశగా ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ‘జన్మభూమి - మా ఊరు' కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నామన్న చంద్రబాబు పూర్తి స్థాయిలో నీరందిస్తే రైతులకు ఎంతో మేలు చేయగలమనే విశ్వాసం వ్యక్తం చేశారు. సుస్థిర అభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. శుక్రవారం నర్సీపట్నం నియోజకవర్గంలోని ధర్మసాగరం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి- మావూరు కార్యక్రమంలో ప్రసంగించారు. పెన్నా నుంచి వంశధార వరకూ నదులను అనుసంధానం చేయడం ద్వారా ఆదర్శంగా నిలుస్తామన్నారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును పరిష్కరించి తీరాలని... ఒక్క ఫిర్యాదు కూడా పెండింగ్ లో ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications