బడి ఎగ్గొట్టినవారు ఎదిగారు: చంద్రబాబు సెటైర్లపై జెసి దివాకర్ రెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శానససభ లాబీలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా తనను కలవడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు.
బడి ఎగ్గొడితే ఫెయిలవుతారని చంద్రబాబు జెసిపై సెటైర్ వేశారు. అయితే, ఆ విషయం అంతటితో ముగిసిపోలేదు. చంద్రబాబును కలిసిన తర్వాత లాబీలో జెసి దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బడి ఎగ్గొట్టినవారు బ్యాంక్ బెంచీవారు..
తాను ఎప్పుడు కూడా ఫెయిల్ కానని జెసి దివాకర్ రెడ్డి శాసనసభ లాబీలో సోమవారం మీడియాతో అన్నారు. బడి ఎగ్గొట్టినవారు, బ్యాక్ బెంచీలో కూర్చున్నవారు ఉన్నత స్థానానికి ఎదిగారని ఆయన అన్నారు. తద్వారా సిఎం సెటైర్కు ఆయన సమాధానమిచ్చారు.
తనకు ఆ ఆలోచన లేదు...
రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన తనకు లేదని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జెసి దివాకర్ రెడ్డి సమాధానమిచ్చారు. ప్రజల చేత ఎన్నిక కావడాన్నే తాను కోరుకుంటానని, రాజ్యసభకు వెళ్లడానికి, ప్రజల చేత ఎన్నిక కావడానికి చాలా తేడా ఉందని ఆయన అన్నారు.
పార్లమెంటులో టిడిపి సభ్యులు అలా...
ప్రత్యేక హోదాపై, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలుగుదేశం సభ్యులు పార్లమెంటులో ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఉభయ సభల్లోనూ ఆందోళనకు దిగారు. ఈ స్థితిలో జెసి దివాకర్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉన్నారు.
జెసి దివాకర్ రెడ్డి ఎప్పుడూ...
జెసి దివాకర్ రెడ్డి ఎప్పుడైనా గమ్మత్తయిన వ్యాఖ్యలు చేస్తుంటారు. కొన్ని సార్లు ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం కూడా తెలిసిందే. బడికి ఎగ్గొట్టినవారు, బ్యాక్ బెంచీవారు ఉన్నతస్థానాల్లో ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్య ఎవరికి వర్తిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.