అమ్మాయిపై ప్రేమోన్మాది ఘాతుకం: హిజ్రాల కిరాతకం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మణికంఠ అనే ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే అక్కసుతో బీటెక్ విద్యార్థినిపై మణికంఠ కత్తితో దాడి చేశాడు. అతడిని అడ్డుకోబోయిన అబ్దుల్ అనే వ్యక్తిపైనా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
విద్యార్థిని ఇంటివద్దే ప్రేమోన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే లాలాపేట పోలీసులు అక్కడకు చేరుకుని మణికంఠను అరెస్ట్ చేశారు. గతంలోనూ మణికంఠ ఓసారి అరెస్టయ్యాడు. అయినా అతను తన పద్ధతిని మార్చుకోలేదు.
నెల్లూరు జిల్లాలోదని తలమంచి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ ప్రయాణికుడిని హిజ్రాలు చితకబాది బంగారం, డబ్బు ఎత్తుకెళ్లారు. హిజ్రాల దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో ఓ బస్సు విధ్వంసం సృష్టించింది. వేగంగా వస్తున్న ప్రైవేటు వోల్వో బస్సు ఓ గొర్రెల మందపైకి దూసుకెళ్లిన సంఘటన నెల్లూరు జిల్లాలో శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థితోపాటు 15 గొర్రెలు మృతి చెందాయి.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం ఎడమంకల్లు క్రాస్రోడ్డు దగ్గర శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీ - ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
చెట్టును ఢీకొన్న కారు
పశ్చిమగోదావరి జిల్లాలో అతి వేగంతో కారు చెట్టుకు ఢీకొని ఒకరు మరణించారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఏలూరు రూరల్ మండలం పాలగూడెం గ్రామం వద్ద ఓ కారు వేగంగా వస్తూ చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో నాగమహేష్ (25) అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో పవన్కుమార్, సత్యబాబులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు.