టీడీపీతో బీజేపీ పొత్తు- అభినందించిన జేపీ నడ్డా: 2024 ఎన్నికల్లో..?!
అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ మున్సిపాలిటీలో తెలుగుదేశం-బీజేపీ ఘన విజయం సాధించాయి. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి.
పోర్ట్ బ్లెయిర్: అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ మున్సిపాలిటీలో తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఘన విజయం సాధించింది. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. తిరుగులేని మెజారిటీని సాధించాయి. మున్సిపాలిటీపై ఆధిపత్యాన్ని నిలుపుకొన్నాయి. ఈ విజయం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు.

అద్భుత విజయం..
బీజేపీ-టీడీపీ సంకీర్ణ కూటమి అద్భుత విజయాన్ని సాధించిందని ప్రశంసించారు. ఈ విజయానికి కారకులైన తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. పోర్ట్ బ్లెయిర్ ప్రజలు ఓ కీలక మైన తీర్పును ఇచ్చాయని, ఇది వారి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.

మోదీ నాయకత్వంపై..
ఈ మేరకు కొద్దిసేపటి కిందటే జేపీ నడ్డా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. పోర్ట్ బ్లెయిర్ ప్రజలు కృషి, అంకితభావం ఫలించాయని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై పోర్ట్ బ్లెయిర్ ప్రజలు ఎంతో నమ్మకం ఉంచారనేది ఈ గెలుపుతో స్పష్టమైందని పేర్కొన్నారు.

డీఎంకే, కాంగ్రెస్..
పోర్ట్ బ్లెయిర్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. 70 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత ఏడాది మార్చిలో ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం-బీజేపీ 10 చొప్పున వార్డులను గెలుచుకున్నాయి. మెజారిటీ గ్రామ పంచాయతీలను సొంతం చేసుకున్నాయి. సంయుక్తంగా అధికారాన్ని అందుకున్నాయి. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్ ఇక్కడ నామమాత్రంగా పోటీ ఇచ్చింది.
చెరిసగం..
మున్సిపల్ ఛైర్మన్ పదవిని పంచుకోవాలని టీడీపీ-బీజేపీ అప్పట్లోనే నిర్ణయించుకున్నాయి. అయిదు సంవత్సరాల మున్సిపల్ ఛైర్మన్ పదవీ కాలాన్ని బీజేపీ 1, 4,5 సంవత్సరాలు.. టీడీపీకి 2, 3 సంవత్సరాలు పంచుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా పొత్తు ధర్మాన్ని అనుసరించి టీడీపీకి మున్సిపల్ ఛైర్మన్ పదవిని అందించింది బీజేపీ.

తెలుగు ప్రజలు..
పోర్ట్ బ్లెయిర్ లో తెలుగు, తమిళ ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తోన్నారు. ఉపాధి అవకాశాల కోసం ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పోర్ట్ బ్లెయిర్ కు తరలి వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. స్థానిక రాజకీయాలపైనా పట్టు సాధించారు. కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ, టీడీపీ అక్కడ బలంగా ఉన్నాయి.
2024లో..
ఇదిలావుండగా.. బీజేపీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. ఇదే పొత్తు 2024లోనూ కొనసాగాలని ఆకాంక్షిస్తోన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ఏపీ రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడికి నాంది పలుకుతాయని ఆశిస్తోన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే- ఇలాంటి తిరుగులేని విజయాలు సొంతమౌతాయని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications