బెజవాడలో జగన్ 'తొలి' రాజకీయం, షాక్: సొంత జిల్లా ఎమ్మెల్యే డుమ్మా
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే, 2014లో వైసిపి నుంచి గెలిచిన ఇరవై మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు.
వైసిపిని వీడి, టిడిపిలో చేరిన వారు తొలుత తాము చేరమని చెప్పిన వారే చాలామంది ఉన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఆ పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భేటీలలో, సమావేశాలలో పాల్గొనని వారు పైన అనుమానాలు తలెత్తుతున్నాయి.
అయితే, కొందరు అవసరం నిమిత్తం కూడా భేటీ జరిగినప్పుడు దూరంగా ఉంటున్నారు. తాజాగా, మరో ఎమ్మెల్యే వైసిపి భేటీకి దూరం ఉన్నారు.
మంగళవారం నాడు విజయవాడలో వైసిపి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీపీలంతా హాజరయ్యారు. పార్టీ అధినేత జగన్ కూడా హాజరయ్యారు.
అయితే జగన్ సొంత జిల్లాలో ప్రొద్దటూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ ముఖ్య నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాత్రం విజయవాడ భేటీకి హాజరు కాలేదు. ఏపీలో తొలిసారిగా జరుగుతున్న ఈ భేటీకి డుమ్మా కొట్టిన రాచమల్లు తెలుగు న్యూస్ ఛానెల్ ఈటీవి చేపట్టిన 'వన భారతి- జన హారతి'కి హాజరయ్యారని అంటున్నారు. ప్రొద్దటూరు శివారు దొరసానిపల్లి గుడి వద్ద సదరు ఛానెల్ చేపట్టిన కార్యక్రమంలో రాచమల్లు మొక్కలు నాటారు.
ఇదిలా ఉండగా, విజయవాడ వేదికగా జగన్ తొలిసారి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పారు. బాబుకు వ్యతిరేకంగా ప్రజల గొంతుకను వినిపించాలన్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేలతో తన ప్రస్తానం మొదలైందని, ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామన్నారు. అలాగే, తొమ్మిది మంది ఎంపీలు గెలిచారన్నారు.
జగన్ విజయవాడలో సమావేశం నిర్వహించడంపై చర్చకు దారి తీసింది. చంద్రబాబు పాలనా యంత్రాంగాన్ని మొత్తం బెజవాడ తరలించాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ బలపడకపోతే నష్టమని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక సమావేశాన్ని బెజవాడలో నిర్వహిస్తున్నారని అంటున్నారు. బెజవాడ కేంద్రంగా ఇక నుంచి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నారు.