YS Avinash Reddy : తెలంగాణ హైకోర్టును ముందస్తు బెయిల్ కోరిన వైఎస్ అవినాష్ రెడ్డి...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇవాళ సీబీఐ విచారణకు పిలిపించి. మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాలని సమన్ల జారీ చేయడంతో ఆయన పులివెందుల నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తున్నారు. ఈ లోపు కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైసీపీ ఎంపీ.. ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

పెదనాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని పులివెందులలో సీబీఐ అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్ కు పంపిన నేపథ్యంలో ఇవాళ సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు అవినాష్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణ తీరును తప్పుబడుతూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు.
వివేకా హత్య కేసులో తొలిసారిగా సీబీఐ తనను నిందితుడిగా చేర్చడం, ఇవాళ ఐదోసారి విచారణకు పిలవడంపై ఆగ్రహంగా ఉన్న అవినాష్ రెడ్డి.. తనకు అరెస్టు తప్పదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణ హైకోర్టును ముందస్తు బెయిల్ కోరుతూ ఆశ్రయించారు. ఈ మేరకు ఛీఫ్ జస్టిస్ బెంచ్ వద్ద ఆయన తరఫు న్యాయవాది ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్ పై లంచ్ మోషన్ లో విచారణ జరపాలని అవినాష్ కోరుతున్నారు. అవినాష్ లాయర్ అభ్యర్ధనపై స్పందించిన సీజే.. హైకోర్టులో ఉన్న వివేకా కేసు వివరాలన్నీ తన ముందుంచాలని కోరారు.
నిన్న తన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. అనంతరం తనను విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడాన్ని అవినాష్ తన ముందస్తు బెయిల్ పిటిషన్ లో తప్పుబట్టినట్లు తెలుస్తోంది. కాబట్టి సీబీఐ విచారణకు వ్యతిరేకంగా పోరాడుతూనే, ముందస్తు బెయిల్ కూడా ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టులో ఇవాళ వివేకా హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పైనా విచారణ జరగనున్న నేపథ్యంలో అవినాష్ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications