కడప లో అనూహ్య పరిణామాలు - పదవీ గండం..!?
కడప రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి - మేయర్ సురేశ్ మధ్య కార్పోరేషన్ వేదికగా కొంత కాలంగా రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. తాజాగా మరో రచ్చ చోటు చేసుకుంది. జనరల్ బాడీ మీటింగ్ వేదికగా కుర్చీలాట మరోసారి రచ్చ రాజేసింది. ఇదే సమయంలో సాంకేతికత అంశం తెర మీదకు వచ్చింది. ఇది అమలు చేస్తే కార్పోరేషన్ పాలక వర్గానికి పదవీ గండం ముప్పు పొంచి ఉంది. దీంతో, ఇప్పుడు మేయర్ ఏం చేయబోతున్నారు.. కడప కేంద్రంగా రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది కీలకంగా మారుతోంది.
కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి వివాదం చోటు చేసుకుంది. సర్వసభ్య సమావేశం కోసం అధికారులు సమావేశ మందిరంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మేయర్, కమిషనర్ తోపాటు కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేశారు. కాగా, మేయర్ సురేశ్ బాబు సమావేశ మందిరంలో కాకుండా తన ఛాంబర్లోనే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ సభ్యు లు కూడా సమావేశ మందిరానికి రాకుండా మేయర్ ఛాంబర్లోనే సమావేశమయ్యారు. దీంతో, తనకు తెలియకుండా సమావేశ మందిరంలో ఏర్పాట్లు ఎందుకు చేశారంటూ అధికారులు, సిబ్బందిపై మేయర్ సురేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం తన ఛాంబర్లోనే నిర్వహించాలని కమిషనర్కు ముందుగానే లేఖ రాసినట్లు మేయర్ తెలిపారు.

కాగా, మేయర్ సురేశ్ బాబు ఛాంబర్కు అధికారులు నోటీసులు అంటించారు. ఈ నెల 13న ఇచ్చిన నోటీసు ప్రకారం కౌన్సిల్ హాల్లోనే సమావేశానికి ఏర్పాటు చేశామని అందులో పేర్కొన్నారు. కోరం సభ్యులు లేనందున ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు పరిగణించాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సాంకేతిక అంశం తెర మీదకు వచ్చింది. కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఈ నెల 22వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా సమావేశం నిర్వహించకపోతే మేయర్ తో పాటుగా కార్పోరేటర్లు పదవులు కోల్పోతారు. శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసినా.. కోరం లేని కారణంగా జరగనట్లు అధికారులు స్పష్టం చేయటంతో ఇప్పుడు పదవీ గండం అంశం తెర మీదకు వచ్చింది. ఇక, ఇప్పుడు సమావేశానికి సమయం లేకపోవటంతో.. కడప కార్పోరేషన్ భవితవ్యం ఏంటనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications