స్వల్ప ఘర్షణలు, ఓట్ల గల్లంతు: ప్రశాంతంగా ముగిసిన ‘కాకినాడ’ పోలింగ్, భారీగా పోలింగ్
స్వల్ప ఘర్షణలు మినహా మంగళవారం జరిగిన కాకినాడ నగర పాలక(కార్పొరేషన్) ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది.
Recommended Video

తూర్పుగోదావరి: స్వల్ప ఘర్షణలు మినహా మంగళవారం జరిగిన కాకినాడ నగర పాలక(కార్పొరేషన్) ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 5గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటువేసే అవకాశం కల్పించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 241 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాకినాడలో నగర కార్పొరేషన్ పరిధిలో 196 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతాల్లోని ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. నగరంలోని మాత్రం కొంత మందకొడిగా ఓటింగ్ సాగడం గమనార్హం.

మంగళవారం సాయంత్రం 4 గంటల సమయానికి మొత్తం 60.43 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. కాకినాడ పురపాలక ఎన్నికల్లో 2,29,373 మంది ఓటర్లు ఉన్నారు.
కాకినాడ నగరపాలక ఎన్నికల్లో తొలిసారి 2005లో 67 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2014లో 67శాతం నమోదైంది. ఈ సారి కూడా ఆ స్థాయి వరకు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అనారోగ్య పీడితులు, వయో వృద్ధులను పోలింగ్ కేంద్రాలకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలించడం కనిపించింది.
స్వల్ప ఘర్షణలు: ఓట్ల గల్లంతు
ఏటిమొగ, రామారావు నగర్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతోపాటు మరికొన్ని చోట్ల కూడా స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
పలు ప్రాంతాల్లో చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో పలువురు ఓటర్లు తమకు ఓటు హక్కు కల్పించాలంటూ ఆందోళనకు దిగారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. సెప్టెంబర్ 1న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications