జగన్ రౌడీ సిఎం, రౌడీ ఎమ్మెల్యేల వ్యాఖ్య: చట్టాలు చాలడం లేదని కాల్వ
హైదరాబాద్: తమది సైకో పార్టీ కాదని, అసెంబ్లీలో రౌడీ సిఎం, రౌడీ ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సభ్యుడు కాల్వ శ్రీనివాసులు తీవ్రంగా ప్రతిస్పందించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సైకో పార్టీగా అభివర్ణిస్తూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జగన్ రౌడీ సిఎం, రౌడీ ఎమ్మెల్యేలంటూ వ్యాఖ్యానించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు వాయిదా అనంతరం అసెంబ్లీ తిరిగి ప్రారంభమయ్యాయని తర్వాత ఆ వివాదంపై తీవ్ర దుమారం చెలరేగింది. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. నేరాలే వృత్తిగా సాగుతున్న కుటుంబం నుంచి వచ్చిన జగన్ చంద్రబాబును రౌడీ ముఖ్యమంత్రి అంటుంటే నిజాయితీ సిగ్గుతో తలదించుకుంటుందని విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.

ప్రతిపక్ష నాయకుడు సభా హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. అవినీతికి ప్రతిరూపమైన వైసీపీ ముఖ్యమంత్రిపై అర్థంపర్ధం లేని ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు .జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
సిఎం, ఎమ్మెల్యేలపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరి కాదని కాల్వ శ్రీనివాసులు అన్నారు. జగన్ చేసిన నేరాలకు శిక్ష వేయడానికి మన చట్టాలు చాలడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్పై కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications