Governors : కంభంపాటి హరిబాబు,బండారు దత్తాత్రేయ రాజకీయ ప్రస్థానం ఇదే...
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం(జులై 6) ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు తెలుగువాళ్లు ఉండటం విశేషం. ఒకరు ఇప్పటికే గవర్నర్గా పనిచేస్తున్న బండారు దత్తాత్రేయ కాగా... మరొకరు మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు.
బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా వ్యవహరిస్తుండగా తాజాగా ఆయన్ను హర్యానా గవర్నర్గా నియమించారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే... 1980లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1991లో తొలిసారిగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1996-98 కాలంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
1998,99,2014లలో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. రెండుసార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు.అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో రైల్వే మంత్రిగా,మోదీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో కేంద్రం ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించింది. తాజాగా హర్యానా గవర్నర్గా నియమితులయ్యారు.
కంభంపాటి హరిబాబు విషయానికి వస్తే... తాజాగా ఆయన మిజోరాం గవర్నర్గా నియమితులయ్యారు. 1999లో హరిబాబు విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 లోక్సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హరిబాబుపై ఓటమి చెందారు. అదే సంవత్సరం ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. విద్యార్థిగా ఉన్నప్పుడు హరిబాబు జైఆంధ్రా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1993 వరకు ఆంధ్రా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 1993-2003 వరకు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.
మిజోరాం గవర్నర్గా తనను నియమించినందుకు హరిబాబు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. మిజోరాం అభివృద్ది కోసం తాను శాయాశక్తులా కృషి చేస్తానని అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ బద్దంగా అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.