కొత్త అసెంబ్లీ మయసభలా ఉంది, కన్ఫ్యూజ్ అయ్యా: మంత్రి కామినేని
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించిన నూతన అసెంబ్లీపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించిన నూతన అసెంబ్లీపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన భవనం కావడంతో ఇప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఛాంబర్లు, పార్టీ కార్యాలయాలు, సభా మందిరం ప్రవేశ ద్వారాల విషయంలో సభ్యుల్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది.
ఈ క్రమంలో ఇదంతా మయసభలా ఉందంటూ మంత్రి కామినేని ఛమత్కరించారు. తాను కూడా కన్ఫ్యూజ్ అయినట్లు తెలిపారు. మంత్రి కామినేని శ్రీనివాసరావు శాసనసభకు, మండలికి దారి వెతుక్కుంటూ వెళ్లడం గమనార్హం.
కాగా, ఇదే కన్ఫూజన్తో మరో మంత్రి కొల్లు రవీంద్ర కూడా మండలికి వెళ్లబోయి వెనుదిరిగారు. కాగా, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు డిప్యూటీ సీఎం ఛాంబర్ నుంచి నేరుగా మండలిలోకి వెళ్లబోయారు.
రోజాపై బొండా ఆగ్రహం
అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజాను చూసి అసెంబ్లీ భయపడుతోందంటున్నారు. అసెంబ్లీ కాదు కదా.. అసెంబ్లీలో అటెంటర్ కూడా భయపడడు. హెల్పర్ కూడా భయపడడు. రోజాను చూసి ఎందుకు భయపడాలి?' అంటూ ప్రశ్నించారు.
'నువ్వు(రోజా) సరిగ్గా ఉండు. నీ ప్రవర్తన మార్చుకో. నీ తోటి శాసనసభ్యులను కూడా నువ్వు గౌరవించడం నేర్చుకో. అంతేకానీ అహకారం ధోరణి ప్రవర్తిస్తే ఎవరూ ఎవరికీ ఎక్కువ కాదు. అందరూ ప్రజలు ఆశీర్వదిస్తేనే గెలిచి వచ్చారు. ఇలాగ అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉంది. ఇప్పుడు ఇలాంటి సంప్రదాయాన్ని మనం సపోర్ట్ చేస్తే.. రాబోయే రోజుల్లో దీన్ని చూసి రెచ్చిపోయి అందరిమీదా ఎగబడతారు. అందుకే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి' అని బొండా అన్నారు.