జగన్, పవన్లను తిట్టడం పనిగా, దొంగదీక్షలు: చంద్ర బాబుపై కన్నా తీవ్ర విమర్శలు
ప్రకాశం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గడిచిన నాలుగేళ్లలో చేసిందేమీ లేదని, ఏ రంగానికైనా మేలు చేస్తే చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్, పవన్లను తట్టిడమే మీ పనా?
ఒంగోలు బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తిట్టుకుంటూ బతకడం తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని ఆరోపించారు.
Recommended Video
టీడీపీ నేతలు దోచుకుంటున్నారు
కేంద్రం సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం షో చేస్తోందని, కేంద్ర నిధులను టీడీపీ నేతలు దోచుకుంటున్నారని కన్నా విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దొంగదీక్షలు చేస్తారా?
రామాయపట్నం పోర్ట్ కోసం కేంద్రానికి ఎందుకు ప్రతిపాదనలు పంపడం లేదని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం వివరాలు అడుగుతుంటే ఇవ్వకుండా బాబు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని టీడీపీవాళ్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.
అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తాం
అన్ని రాష్ట్రాల కంటే ఏపీకి కేంద్రం పక్కా గృహాలు అధికంగా మంజూరు చేసిందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటుంటే.. ప్రజల వలయంగా నిలబడాలా? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి రహితంగా పాలన చేస్తామని తెలిపారు. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ బీజేపీ శ్రేణులను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.