సోనియా, సుష్మలకు థ్యాంక్స్: ప్రసంగంపై బాధపడ్డ కవిత
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం లోకసభలో మాట్లాడుతూ... తెలంగాణ విషయమై సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం సోనియా కృషి ఎనలేనిదన్నారు. లోకసభలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించిన సుష్మకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తెలంగాణ కోసం సోనియా, మహిళలు ఎంతో కృషి చేశారని చెప్పారు.
రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై శుభాకాంక్షలు తెలపకపోవడం బాధాకరమన్నారు. పోలవరం ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రస్తుత డిజైన్తో పోలవరం ప్రాజెక్టు వల్ల ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతో నష్టమన్నారు. పోలవరంపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని కోరారు.

ప్రస్తుత డిజైన్తో ప్రాజెక్టు కడితే గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. ముంపు ప్రాంతాల అభీష్టానికి వ్యతిరేకంగా ఏడు మండలాలను ఎపిలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తొలి కేబినెట్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. తాము పోలవరానికి వ్యతిరేకం కాదని, డిజైన్ మార్చాలని సూచించారు.
నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్) చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆంధ్రలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరారు. గిరిజనుల జీవితాలతో ఆడుకోవద్దని కోరారు. భద్రాచలం శ్రీరాముల వారిని దర్శించుకునేందుకు తెలంగాణ ప్రజలకు దారి కూడా లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications