వనజాక్షిపై దాడి: బిజెపికీ చెడ్డపేరని కావూరి ఆవేదన, దర్యాఫ్తు వేగం
ఏలూరు: తహసీల్దారు పైన దాడి విషయంలో ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయకుంటే భారతీయ జనతా పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత కావూరి సాంబశివ రావు శుక్రవారం నాడు అన్నారు. చింతమనేనిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదుద్దేశ్యంతో డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్లు ఇస్తే వారిని అడ్డం పెట్టుకొని చింతమనేని కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారని ఆరోపించారు.
ఇలాంటి అరాచక శక్తులను చంద్రబాబు ఉపేక్షించొద్దన్నారు. ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా చేయాలన్నారు. కట్టడి చేయకుంటే రాజకీయాల్లో నేరశక్తులు పెరిగిపోతాయని హెచ్చరించారు. కాగా వనజాక్షి మీద దాడి ఘటనపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారని ఏపీఎన్జీవోలు చెప్పారు.
వనజాక్షి పైన దాడి కేసు దర్యాఫ్తు వేగవంతం కానుంది. తమ్మిలేరు వాగులో ఇసుక రీచ్ల సరిహద్దులను తేల్చాలని రెవెన్యూ అధికారులకు డీఎస్పీ వెంకటరమణ లేఖ రాశారు. ఈ సంఘటన పైన రంగంపేట గ్రామస్థుల స్టేట్మెంట్ కూడా నమోదు చేశారు.